కల్వకుంట్ల కవిత తన కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టిఆర్ఎస్) అని ప్రకటించారు. మునీరాబాద్లోని అద్వయ ఫంక్షన్ హాలులో పార్టీ అవిష్కరణ సభలో పార్టీ జెండా ఆవిష్కరించి పేరు ప్రకటించారు. పార్టీ జెండాలో పసుపు రంగు నేపధ్యంలో నీలం రంగుతో తెలంగాణ చిత్ర పటం రూపొందించారు.
అంతకు ముందు ఆమె గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “మా పార్టీ ఏర్పాటుతో తెలంగాణలో కొత్త విప్లవం మొదలవుతుంది. ప్రజల ఆశీర్వాదాలతో ఖచ్చితంగా నేను తెలంగాణ ముఖ్యమంత్రినవుతా,” అని అన్నారు.
పార్టీ పేరు, జెండా ఆవిష్కరిస్తున్నప్పుడు అనుచరులు సిఎం సిఎం అంటూ నినాదాలు చేస్తుంటే అం చిర్నవ్వులు చిందించారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ ఇంత కాలం ప్రజల కోసం వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడాము. కానీ కేవలం పోరాటాలు చేస్తే సరిపోదు. ప్రజల సమస్యలు పరిష్కరించి సామాజిక తెలంగాణ సాధించాలంటే అధికారం కూడా అవసరం. కనుకనే టీఆర్ఎస్ పార్టీతో ప్రజల ముందుకు వస్తున్నాను,” అని అన్నారు.
కొన్ని రోజుల క్రితం కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ, “టీఆర్ఎస్ పార్టీ పేరు ఖాళీగానే ఉంది. కనుక దానిని ఎవరైనా వాడుకోవచ్చు ఇప్పుడు,” అన్నారు. కానీ ఆ పేరు ఉపయోగించుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యంతరాలు, విమర్శలతో పాటు న్యాయపరమైన సమస్యలు కూడా ఎదురవవచ్చు.
కనుక ఆమె ఆ పేరులో నుంచి ‘తెలంగాణ’ ‘సమితి’ రెండు పదాలు తీసుకొని ‘తెలంగాణ ప్రజా వికాస్ సమితి’ అని పేరు పెట్టుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ ‘టీఆర్ఎస్ పార్టీ’ అని ప్రకటించి ఆమె అన్నంత పనీ చేస్తారని ఎవరూ ఊహించలేదు. కనుక బీఆర్ఎస్ పార్టీకి ఇక ఆ అవకాశం లేకుండా చేశారని చెప్పవచ్చు.




