వింటున్నారా… మోడీ వలన చంద్రబాబు గెలిచారంట..!

Kanna Lakshmi Narayana about Chandrababu Naidu Winning Electionsసార్వత్రిక ఎన్నికల సమయం సమీపించక మునుపే రాజకీయాలలో పొత్తు వైరం మాటల తూటాలను పేల్చుతోంది. ముఖ్యంగా ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ భేటీ అయిన అనంతరం, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి, రాజకీయ నేతల విమర్శలు కూడా జోరందుకుంటున్నాయి. ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని నాని బిజెపిని టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలు రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యాయి. గత ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకోవడం వలన, తన మెజార్టీ 75 వేలకు మాత్రమే వచ్చిందని, లేని పక్షంలో లక్షన్నర్ర వచ్చేదని, ఈ సారి మూడు లక్షలు ఖాయమంటూ చేసిన వ్యాఖ్యలపై బిజెపి సీనియర్ నేతలు మండిపడుతున్నారు.

నాని చేత ఈ వ్యాఖ్యలు చేయిస్తున్నారా? లేక నానినే మాట్లాడుతున్నారా? అనే విషయంపై తమకు స్పష్టత కావాలని కన్నా లక్ష్మీ నారాయణ వంటి వారు డిమాండ్ చేస్తున్నారు. వ్యక్తిగతమైన అభిప్రాయమో, పార్టీ పరమైన భావనో అని చెప్పాలని డిమాండ్ చేయడంలో తప్పులేదు, ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే రాజకీయ నాయకులు ఇలా సర్దుకుపోయే మాటలు ఎందుకు చెప్తారు? దీనికి మరింత మసాలాలు చేర్చి, గత ఎన్నికల్లో తమ వలన మెజార్టీ తగ్గిందనే భావన అయితే మా పార్టీ పరంగా లేదని, నిజానికి నాడు మోడీ హవా వలనే తెలుగుదేశం పార్టీ గెలుపొందిందని కన్నా లక్ష్మీ నారాయణ వ్యాఖ్యానించడం విశేషం.

ADVERTISEMENT

దేశమంతా మోడీ వేవ్ పని చేసిందని, అందులో భాగంగా పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీకి కూడా ఇది కలిసి వచ్చిందని, ఏపీలో అధికారంలో ఉన్న పార్టీకి పెద్దగా మెజార్టీ ఏం లేదని, కేవలం నాలుగైదు లక్షలు మాత్రమేనని, అది కూడా తమ వలన, అలాగే నాడు మరో పార్టీ ‘జనసేన’ పవన్ కళ్యాణ్ కూడా అండగా నిలవడం వలన వచ్చాయన్న అభిప్రాయాన్ని కన్నా వ్యక్తపరిచారు. నేరుగా చెప్పకపోయినా… బిజెపి అధిష్టానం మదిలో గానీ, స్థానిక బిజెపి నేతలలో గానీ… “మోడీ వలనే చంద్రబాబు గెలిచారు” అన్న బలమైన అభిప్రాయం ఏర్పడినట్లు కనపడుతోంది. గతంలో పురంధేశ్వరి వంటి కేంద్ర స్థాయి నేతలు కూడా దాదాపుగా ఇదే రకమైన భావాలను వ్యక్తపరిచారు.

ఈ బిజెపి నేతల ఊకదంపుడు మాటలు ఎలా ఉన్నా… ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తెలిసిన వారికి, గత ఎన్నికలలో మోడీ వలన చంద్రబాబుకు నిజంగా ఎంత ప్రయోజనం చేకూరింది అన్న విషయం ఇట్టే అర్ధమవుతుంది. తన మెజార్టీ తగ్గిందని కేశినేని నాని చేసిన వ్యాఖ్యల్లో ఎంత వాస్తవం ఉందో చెప్పలేం గానీ, బిజెపితో పొత్తు వలన ఏపీలో ఇసుమంత ప్రయోజనం కూడా టిడిపికి దక్కలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. కన్నా చెప్పినట్లు, ఏపీలో రెండు ప్రధాన పార్టీల మధ్య వ్యత్యాసం ఉన్న ఆ నాలుగైదు లక్షల ఓట్ల ప్రజానీకం పవన్ కళ్యాణ్ క్రెడిట్ లోకి వెళ్తారేమో గానీ, బిజెపికి మాత్రం కాదన్నది సదరు పార్టీ నేతలు గుర్తిస్తే మంచింది. లేదంటే వచ్చే ఎన్నికలలో “చేదు నిజం” తెలుసుకోవాల్సి ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories