జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడమే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకి పెద్ద అవమానం, అప్రదిష్ట అనుకుంటే, కల్వకుంట్ల కవిత నిన్న వారిపై చేసిన విమర్శలు సంచలన ఆరోపణలు ఇంకా నష్టం కలిగించేలా ఉన్నాయి.
“హరీష్ రావు మహా మోసగాడు. ఆయన సిఎం రేవంత్ రెడ్డితో టచ్లో ఉన్నారు. ఆయన పార్టీలో ఉంటూ ముంచేస్తున్నారు.
కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ తామే బీఆర్ఎస్ పార్టీని భుజాలపై మోస్తున్నట్లు, కేసీఆర్ని కాపాడుకునే బాధ్యత తమదే అన్నట్లు ఇద్దరూ బిల్డప్ ఇస్తున్నారు. కానీ కేసీఆర్ ముందు మనం తూగలేమనే విషయం మరిచిపోతున్నారు.
ఇద్దరూ కృష్ణార్జునులమని చెప్పుకుంటూ ఒకరిపై మరొకరు బాణాలు వేసుకుంటున్నారు. తద్వారా పార్టీ క్యాడర్ని అయోమయపరుస్తున్నారు. ఈ కారణంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నా వెంటే ఉంటామంటూ వస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో మాత్రమే ఉంది బయట లేదు. హరీష్ రావు, గంగుల కమలాకర్, నవీన్ రావులు మెదక్ జిల్లాలో తమ భూములు కాపాడుకోవడానికి రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చేశారు. దాని వలన రెడ్డిపల్లి గ్రామంలో 56 మంది నిరుపేద రైతులకు చెందిన 59 ఎకరాలు కోల్పోయారు.
ఈ విషయాలన్నీ కేసీఆర్కి తెలియకుండా అయన కళ్ళకు గంతలు కట్టారు. అందువల్లే ఎన్నికలలో మెదక్ జిల్లాలో పార్టీ ఓడిపోయింది,” అంటూ కవిత అనేక తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆమెని పార్టీ నుంచి బయటకు గెంటేసినప్పటికీ, అందరూ ఆమెను కేసీఆర్ కూతురుగానే చూస్తారు. ఆమె కూడా తన ఇంటిపేరు ‘కల్వకుంట్ల’ అనే చెప్పుకుంటున్నారు. కనుక కేసీఆర్ కూతురు చేస్తున్న ఈ విమర్శలు, ఆరోపణలు ప్రజలు ఖచ్చితంగా నమ్ముతారు.
ముఖ్యంగా కేసీఆర్ హయంలో భూములు కోల్పోయిన గ్రామస్తులందరికీ ఆమె చేపుతున్నవి వాస్తవాలని తెలుసు కనుక వారు ఆమెకు దగ్గరవుతారు.
కేటీఆర్-హరీష్ రావుల ఆధిపత్యపోరు, కేసీఆర్ మౌనం వలన, పార్టీ శ్రేణులలో తీవ్ర అయోమయం, ఇప్పుడీ ఉప ఎన్నికలో ఓటమి వలన తీవ్ర నిరాశ నిస్పృహలు కలుగుతాయి. వారందరూ తనవైపు వస్తున్నారని కవిత బహిరంగంగానే చెపుతున్నారు.
ఆమె వలన, ఆమె మాటల వలన ఇంత అప్రదిష్టం, ఇంత నష్టం జరుగుతున్నా అందరూ మౌనంగా ఉండిపోవడం బీఆర్ఎస్ పార్టీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది.




