ఒక్కోసారి ఒక్కో రాజకీయ పార్టీ, నాయకుడు, సిఎం లేదా మంత్రులు వార్తలలో హైలైట్ అవుతుంటారు. ఇవాళ్ళ కల్వకుంట్ల కవిత వంతు. ఆమె టీఆర్ఎస్ పార్టీని ప్రకటించి, తండ్రి పాలనపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుంటే, జనాలకి వైఎస్ షర్మిల గుర్తొస్తే తప్పు కాదు.
అయితే ఆమెకు కవితకు చాలా తేడా ఉంది. షర్మిల జాతీయ పార్టీ కాంగ్రెస్లో సోనియా, రాహుల్ కింద పని చేస్తున్నారు. పైగా ఈ రెండేళ్ళలో ఆమె పీకిందేమీ లేదు. అన్న జగన్పై విమర్శలు చేస్తూ ఉడతా భక్తిగా వైసీపీ సమాధి(ఓటమి)కి నాలుగు రాళ్ళు వేశారు అంతే.
ఆమె వస్తే వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలైపోతాయనుకుంటే రెండేళ్ళలో ఒక్కరంటే ఒక్కరూ రాలేదు. పోటీ చేసిన ఏ ఒక్కరూ గెలవలేదు. పార్టీ అధ్యక్షురాలైన ఆమె కూడా ఓడిపోయారు. అప్పటి నుంచి ఓసారి కూటమి ప్రభుత్వాన్ని, మరోసారి అన్న జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ రాజకీయ కాలక్షేపం చేస్తున్నారు షర్మిల.
కానీ కల్వకుంట్ల కవిత నేడు పార్టీ ప్రకటన చేస్తున్నప్పుడే “మా పార్టీ అధికారంలోకి వస్తుంది. నేనే ముఖ్యమంత్రినవుతానంటూ” పక్కా ప్రొఫెషనల్ రాజకీయ నాయకురాలిలా మాట్లాడారు. అంతేకాదు… నేను ముఖ్యమంత్రిని అయితే రాష్ట్రంలో ప్రతీ బిడ్డకి కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తానని రెండేళ్ళు ముందుగానే ఎన్నికల వరం కూడా ప్రకటించేశారు. తనని తాను ‘తెలంగాణ అమ్మ’గా నామినేట్ చేసుకున్నారు కూడా.
‘మా పార్టీ అధికారంలోకి వస్తుంది.. నేను ముఖ్యమంత్రిని అవుతాను..’ అంటూ అప్పుడే ఆమె ఇలా వరాలు ప్రకటించడం కాస్త అతిగా అనిపించవచ్చు కానీ రాజకీయాలలో ఇదే స్టాండర్డ్ ఫార్మాట్.
ఏపీలో జగన్మోహన్ రెడ్డి కూడా రోజూ ఇలాగే చెప్పుకుంటారు. పదేపదే ఈవిధంగా చెప్పుకుంటూ రాష్ట్రంలో పదో వంతు ప్రజల ‘బ్రెయిన్ వాష్’ చేయగలిగినా చాలు… మనోళ్ళ ఓట్లు కూడా కలిస్తే ఎన్నికలలో ఓటింగ్ శాతాలు మారిపోతాయి. ఈ కిటుకు కవిత బాగానే ఒడిసి పట్టుకున్నారని అర్ధమవుతోంది.
అసలే కల్వకుంట్ల కవిత మంచి మాటకారి. కనుక నేటి నుంచే రాబోయే రెండేళ్ళు అంటే 2028 ఎన్నికల వరకు ‘నేనే సిఎం.. నేనే సిఎం..’ అని రోజూ జనాల్ని హిప్నటైజ్ చేస్తూనే ఉంటారు. ప్రతీరోజూ ‘అమ్మ బ్రెయిన్ వాష్ చేస్తుంటే మార్పు తప్పదు కదా?
మరయితే కేసీఆర్, రేవంత్ రెడ్డి, కేటీఆర్ పరిస్థితి ఏమిటి? అనే డౌట్ కలగడం సహజం. కానీ జనాల కంటే ముందు వారు ముగ్గురికే ఈ డౌట్ రావాలి. వస్తే జనాలు హిప్నటైజ్ కాకుండా ఓటు బ్యాంకులను కాపాడుకోవాలి. లేకుంటే అమ్మ బ్రెయిన్ వాష్ చేసేయడం ఖాయం.




