జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ గెలిచి ఉంటే కేటీఆర్కి ఎదురే ఉండేది కాదు. కానీ ఓడిపోవడంతో ఆయన సొంత చెల్లెలు కల్వకుంట్ల కవిత కూడా విమర్శిస్తున్నారు.
ఆమెని బయటకు గెంటేశారు కనుక ఆ ద్వేషంతో ఇలా మాట్లాడుతున్నారనిపిస్తున్నా, ఆమె చెప్పిన కొన్ని విషయాలు, కేసీఆర్ పాలన, బీఆర్ఎస్ పార్టీ డొల్లతనం బయటపెట్టింది.
కేసీఆర్ పదేళ్ళు సిఎంగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం నభూతో నభవిష్యతి అన్నట్లు అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని గొప్పలు చెప్పుకునేవారు.
కానీ జాగృతి జనం బాటలో భాగంగా ఆమె ఇంతవరకు 6-7 జిల్లాలు పర్యటించినప్పుడు మిషన్ భగీరధ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, కాలనీలు, రోడ్లు, ఆస్పత్రులు, పాఠశాలలు ఏ ఒక్కటీ సరిగ్గా లేవని చెప్పారు.
కేసీఆర్ హయంలో అనేక మంది ఉద్యమకారులకు, అనేక వర్గాల ప్రజలకు, మహిళలకు తీరని అన్యాయం జరిగిందని కానీ వాళ్ళని ఎవరూ పట్టించుకోలేదన్నారు.
కేసీఆర్ హయంలో హరీష్ రావుతో సహా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక్కో ప్రభుత్వోద్యోగానికి దాని స్థాయిని బట్టి రూ.2-3 లక్షల చొప్పున వసూలు చేసుకునేవారని కవిత బయటపెట్టారు.
అంటే బీఆర్ఎస్ పార్టీ ఎవరూ ఆణిముత్యాలు కారనే కదా? కాదని తెలిసి ఉన్నప్పుడు ఆమె ఎందుకు మాట్లాడలేదు? కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదు?అనే సందేహం కూడా కలుగుతుంది.
ఆమె చెపుతున్న సమస్యల జాబితాకు అంతే లేదు. వాటన్నిటినీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అంతగా అభివృద్ధి చెందితే ఇప్పుడు ఇన్ని సమస్యలు ఎందుకున్నాయి? అంటే కాంగ్రెస్ అసమర్ధ పాలన వలన అని జవాబు చెప్పడం చాలా సులువు.
కానీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టించి రోడ్లు వేయించలేదని, అనర్హులకు ఇళ్ళు కేటాయించారని, ఉద్యమకారులను పట్టించుకోలేదని, మిషన్ భగీరధతో వారానికి ఒకటి రెండు రోజులే నీళ్ళు వస్తున్నాయని ఆమె స్వయంగా చెపుతున్నారు కదా?
ఆమె హరీష్ రావు పచ్చి మోసగాడని మరోసారి బహిరంగంగా విమర్శించారు. పార్టీ ఆయన చేతికి రాకపోవడంతో లోపలే ఉంటూ పార్టీని దెబ్బ తీస్తున్నారని కవిత ఆరోపించారు. అలాంటి వాడిని తన అన్న కేటీఆర్ నమ్ముకొని కృష్ణార్జునులమని చెప్పుకుంటున్నారని కవిత ఆక్షేపించారు.
ఇద్దరూ కలిసి తమ ప్రత్యర్ధులను ఎదుర్కొంటూ పార్టీని కాపాడుకోవలసింది పోయి, ఒకరిపై మరొకరు బాణాలు వేసుకుంటున్నారని విమర్శించారు.
హరీష్ రావుకి, ఆయన బినామీలకు సిఎం రేవంత్ రెడ్డితో సంబంధం ఉందని, ఆయన సూచన మేరకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్ధిని ఎంపిక చేశారని కవిత మరో బాంబు పేల్చారు.
ఆ ఉప ఎన్నికలో నామినేషన్స్ వేసిన ఓ 15 మంది తన సూచన మేరకు హరీష్ రావుని కలిసి ఎవరికి మద్దతు ఇవ్వాలని అడిగితే ఎవరికైనా ఇచ్చుకోండి… మాకవసరం లేదని పంపించేశారని కవిత చెప్పారు.
హరీష్ రావు తండ్రి చనిపోయినప్పుడు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారని ప్రచారం చేయించుకొని, ఓడిపోగానే ఆయన ప్రచారానికి రాలేకపోవడం వల్లనే పార్టీ ఓడిపోయిందని మరో కొత్త ప్రచారం చేయించుకున్నారని కవిత ఆక్షేపించారు.
కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ కూడా మేము లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదన్నట్లు మాట్లాడటాన్ని తప్పు పట్టారు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే ఉందని, బయట ఎక్కడా లేదని కవిత ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఇప్పటికైనా సోషల్ మీడియాలో నుంచి బయటకు వచ్చి ప్రజలతో మమేకం కావాలని కవిత సూచించారు.
తాను ఏ జిల్లా పర్యటనకు వెళ్ళినా వేలాదిమంది బీఆర్ఎస్ కార్యకర్తలు “అక్కా బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ లేదు. దానినే నమ్ముకుంటే మేమూ రోడ్డున పడతాము. కనుక మేమంతా మీ వెంటే వస్తామని అంటున్నారు,” అని కవిత అన్నారు. అంటే ముందే చెప్పుకున్నట్లు ఈ పర్యటన ముగిసేలోగా బీఆర్ఎస్ పార్టీని ఆమె నిలువునా చీల్చబోతున్నారని భావించవచ్చు.
కనుక ఓ పక్క ఫామ్హౌసులో పడుకొని కేసీఆర్, ఆధిపత్య పోరుతో కేటీఆర్, హరీష్ రావు, ఇలాంటి విమర్శలు, పార్టీని నిలువునా చీల్చే ప్రయత్నం చేస్తూ… ఇలాంటి ఆరోపణలతో కవిత అందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీని సమాధి చేయబోతున్నట్లే ఉన్నారు.






