తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ జాతీయ స్థాయి నాయకుడుగా ఎదగాలని, ప్రధాన మంత్రి పదవి చేపట్టాలని పగటి కలలు కన్నారు. కానీ తప్పుడు విధానాలతో ముందుకు సాగి బోర్లా పడ్డారు.
కేసీఆర్ జాతీయస్థాయి నాయకుడుగా ఎదగాలనుకున్నందున పార్టీ పేరులో ‘తెలంగాణ’ తీసి ‘భారత్’ పెట్టుకున్నారు. పార్టీ పేరు మార్చుకున్నారు కానీ ఆయన మాటల్లో, ఆలోచనల్లో పక్కా ప్రాంతీయ వాదమే తప్ప ఎక్కడా జాతీయ విధానం, జాతీయ స్పూర్తి కనబడదు.
హెలికాఫ్టర్లు, వందల కార్లు వేసుకొని మహారాష్ట్ర పైకి దండయాత్రలు చేయడమే జాతీయ రాజకీయాలనుకున్నారు. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ తప్ప మరో పార్టీ ఉండకూడదనుకోవడం సంకుచిత ప్రాంతీయ వాదమే కదా? అలాంటప్పుడు పక్కా ప్రాంతీయవాదంతో తెలంగాణలోనే రాజకీయాలు చేసుకొని ఉండి ఉంటే నేడు ఈ దుస్థితిలో ఉండేవారు కారు కదా?
కానీ మబ్బులో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకున్నట్లుగా ఎలాగూ ప్రధాన మంత్రిని కాబోతున్నాననే ధీమాతో తెలంగాణ (పేరు) వద్దనుకున్నారు. దానికి భారీ మూల్యం చెల్లించారు. అప్పుడు గానీ కేసీఆర్కి తన పరిధి, పరిమితులు, పొరపాట్లు తెలిసి రాలేదు.
కనుక ఇప్పుడు ‘భారత్’ని వద్దనుకొనిమళ్ళీ ‘తెలంగాణ’ కావాలనుకుంటున్నారు. కానీ ‘ఆయన వద్దనుకున్న తెలంగాణను నేను తీసుకుంటానని, నేనే ముఖ్యమంత్రి అవుతానని,’ కూతురు కవితే చెప్పేశారు.
డీలిమిటేషన్ వలన దేశంలో చిన్న రాష్ట్రాలకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు చాలా నష్టం జరుగుతుందంటూ తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి జాతీయస్పూర్తితో జాతీయ నాయకుడిలా స్పందిస్తుంటే, తెలంగాణకి అన్యాయం జరిగితే సహించబోనని, ఉద్యమాలు తప్పవని కవిత హెచ్చరించారు. ఒకే అంశంపై ఇద్దరి స్పందనలలో ఇంత తేడా కనిపిస్తోంది. కనుక కల్వకుంట్ల కుటుంబం, వారి పార్టీల మనుగడకు ప్రాంతీయవాదాన్నే నమ్ముకున్నట్లు స్పష్టమవుతోంది.
కొత్తగా పార్టీ పెట్టుకుంటున్న ఆమె డీలిమిటేషన్ వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తే అవి దేనికో వేరే చెప్పక్కరలేదు!
మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో లింక్ చేయడం కేంద్రం పెద్ద కుట్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు విమర్శించారు. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ అమలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
తెలంగాణ రాజకీయ ప్రాధాన్యం తగ్గిస్తే ఊరుకోమని… pic.twitter.com/hYBjFx8c1M— Telangana Jagruthi (@TJagruthi) April 16, 2026




