కవిత రాజకీయ విమర్శలు కూడా ఒక ప్రాసలో పద్దతిగా సాగుతున్నాయనే చెప్పాలి. బిఆర్ఎస్ పార్టీలో తనకు దక్కని గౌరవ మర్యాదల కోసం జాగృతిని బయటకు తీసిన కవిత అటు అధికార ఇటు ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నారు.
అయితే ఇన్నాళ్ల తన రాజకీయ ప్రయాణానికి అవకాశమిచ్చిన గులాబీ కారు అధికార పీఠానికి దూరమై ప్రతిపక్షమనే షెడ్ కి వెళ్ళడానికి బిఆర్ఎస్ లో కొందరు కోవర్డ్లు, కట్టప్పలు కారణమంటూ ఆరోపిస్తున్న కవిత ఆ రెండు బిరుదులను కూడా బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కే కట్టబెట్టింది.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టుగా కవిత దృష్టిలో హరీష్ కోవర్ట్, కట్టప్ప నుంచి గుంటనక్కగా ప్రమోట్ అయ్యారు. ఈ మధ్య తరచూ కవిత హరీష్ పై విమర్శలు చేసేందుకు ఆయనను గుంటనక్క అంటూ సంబోధిస్తున్నారు.
ఇక ఆ గుంటనక్కకు ఈ గుంపు మేస్త్రి మంచి మిత్రుడని, వీరిద్దరికి అంతర్గతంగా మంచి సంబంధాలు ఉన్నాయంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గుంపు మేస్త్రి గా చిత్రీకరిస్తున్నారు. ఫోన్ టాపింగ్ కేసు విచారణ నేపథ్యంలో గత బిఆర్ఎస్ పాలకులు ఒక్కొక్కరుగా ఈ కేసు విచారణకు సిట్ ముందు హాజరవుతున్నారు.
మొన్న హరీష్ తో మొదలైన ఈ కేసు విచారణ, నిన్న కేటీఆర్ వరకు రాగా ఇక నేడు తాజాగా ఈ కేసులో సంతోష్ రావు వంతు వచ్చింది. ఈ తరుణంలో కేసీఆర్ బంధువు, బిఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావు నేడు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన కవిత సంతోష్ రావు ని గురి పెట్టారు. కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో ఒక ఇడ్లీ తిన్నారా.? అర ఇడ్లీ తిన్నారా అన్న సమాచారాన్ని ఈ గూడఛారే ఆ గుంపు మేస్త్రికి జారవేస్తారు అంటూ సంతోష్ ని గూఢచారిగా అభివర్ణించారు.
గుంపు మేస్త్రి కి కేసీఆర్ కోట రహస్యాలు అందించే ఈ గూఢచారిని సిట్ విచారణకు పిలవడం వరకు ఒకే కానీ ఆ గూఢాచారిని గుంపు మేస్త్రి శిక్షిస్తాడన్న నమ్మకం నాకు లేదు అంటూ కవిత సంతోష్ విచారణ పట్ల అనుమానాలను లేవనెత్తారు.
అయితే కవిత ఇలా రేవంత్ ని గుంపు మేస్త్రిగా హరీష్ ని రేవంత్ కి సహకరించే గుంటనక్కగా, సంతోష్ ని రేవంత్ గూఢాచారిగా చిత్రీకరిస్తూ బిఆర్ఎస్ పార్టీలో అపనమ్మకం అనే విత్తనాలు నాటాలని భావిస్తున్నారా.? లేక బిఆర్ఎస్ లో మొలకెత్తిన కలుపు విత్తనాలను తెలంగాణ ప్రజలతో పాటు బిఆర్ఎస్ అధినాయకత్వానికి కూడా తెలియచేప్పాలని ఆరాటపడుతున్నారా.?






