టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలకు ఆమె తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్ ఇద్దరూ ఇంత వరకు సమాధానం చెప్పనే లేదు. ఆమె పార్టీ ప్రకటనకు సరిగ్గా 5 రోజుల ముందు జగిత్యాల సభలో కేసీఆర్ ఆమెకు చెక్ పెడతారని అందరూ అనుకున్నారు. కానీ కూతురు ఊసే ఎత్తలేదు.
సరే! ఆమె పార్టీ పెట్టక ముందే మాట్లాడటం తొందరపాటు అవుతుందనుకున్నా, ఆమె పార్టీ పెట్టిన రెండు రోజుల తర్వాత జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సమావేశంలో కూడా కేసీఆర్తో సహా ఆ పార్టీ నేతలెవరూ మాట్లాడలేదు. ఆమె ‘టీఆర్ఎస్’ పేరు హైజాక్ చేసినా స్పందించలేదు. కేసీఆర్ని పేరు పెట్టి విమర్శించినా స్పందించలేదు.
కల్వకుంట్ల కవిత చేస్తున్న విమర్శలకు, ఆరోపణలకు జవాబు చెప్పలేక మౌనం వహిస్తున్న కేసీఆర్ దమ్మున్న నాయకుడని, వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీయే గెలిచి అధికారంలోకి వస్తుందని కేటీఆర్ చెప్పుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
ఆమె ఆరోపణలకు కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పకపోవడంతో వాటిని అంగీకరిస్తున్నట్లే ప్రజలు భావించకుండా ఉంటారా? వారి మౌనం అర్దాంగీకారం అని అనుకోకుండా ఉంటారా?
అసలు వారు మౌనంగా ఎందుకున్నారు? ఆమెపై కత్తులు దూస్తే ఆమెకే ప్రజల సానుభూతి దొరికి తాము నష్టాపోతామనే భయమా? లేదా ఆమె తమ అవినీతి భాగోతాలు బయటపెడతారనే భయం వల్లనా?
ముఖ్యంగా కల్వకుంట్ల కవిత పూర్తి ఆత్మవిశ్వాసంతో కేసీఆర్ పేరు, ఫోటో వాడుకోకుండానే ‘నేను ముఖ్యమంత్రి అవుతాను,’ అని బల్ల గుద్ది మరీ చెపుతుంటే, ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతారని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఆ మాట చెప్పలేకపోతున్నారు.
తన తండ్రి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకుంటున్నారు. దేనికంటే కేసీఆర్ పేరు, ఫోటోతో మాత్రమే తమకి ప్రజలలో గుర్తింపు లభిస్తుందని చెప్పుకుంటునట్లే ఉంది. తండ్రి పేరు చెప్పుకునే ఎన్నికలలో గెలవగలమని కేటీఆర్ భావిస్తుండటం ఆ పార్టీ దౌర్భాగ్యమే.. కాదా?
తండ్రి రాజకీయాలలో ఉన్నా లేకున్నా కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీతో దూసుకుపోగలరని నిరూపించుకుంటున్నారు.
కానీ రెండున్నరేళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఫామ్హౌసులో ఉండిపోయిన కేసీఆర్, ఒకవేళ ఎన్నికల సమయానికి ఏవో కారణాల చేత శాశ్వితంగా రాజకీయాల నుంచి తప్పుకుంటే? బీఆర్ఎస్ పార్టీ… దాని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిస్థితి ఏమిటి?




