జాగృతి అధ్యక్షురాలు కవిత బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా రాజకీయం మొదలుపెట్టేసారు. ఈ రోజు హైద్రాబాద్ లోని జాగృతి కార్యాలయంలో పలు సామాజిక సంఘాల నేతలతో భేటీ అయిన కవిత ఈ సందర్భంగా కేటీఆర్ ప్రకటించిన పాదయాత్ర మీద స్పందించారు.
గత పదేళ్లు బిఆర్ఎస్ అధికారంలోనే ఉంది. ఆ పదేళ్ల సమయంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రజల మధ్యకు ఎందుకు పోలేదు.? ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తరువాత తిరిగి అధికారం కోసం పాదయాత్ర పేరుతో ప్రజల మధ్యకు వస్తానంటే ఎవరు నమ్ముతారు.? అంటూ సూటిగా కేటీఆర్ టార్గెట్ గా విమర్శలు సంధించారు.
అధికారం కొందరి చేతులలోనే పరిమితం కాకూడదని, అది అందరికి అందాలన్నందుకే బిఆర్ఎస్ నుంచి తనను సస్పెన్షన్ వేటుతో బయటకు పంపారంటూ బిఆర్ఎస్ నాయకత్వాన్ని సైతం టార్గెట్ చేసారు. అలాగే సామాజిక తెలంగాణ లక్ష్యంగానే నా ఈ కొత్త రాజకీయ ప్రయాణం ఉంటుందన్నారు.
అయితే కవిత ఇలా ముందుగా హరీష్, ఆ పై సంతోష్, అటు పైన బిఆర్ఎస్ మాజీ మంత్రుల కేంద్రంగా రాజకీయ బాణాలు సంధించారు. ఇక ఇప్పుడు నేరుగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ రాజకీయ వారసుడు, అన్న కేటీఆర్ కే నేరుగా బాణం గురిపెట్టారు.
ఇలా కవిత ఒక్కో సందర్భం నుంచి ఒక్కో దశను దాటుకుంటూ ఇప్పటికే కేటీఆర్ వరకు వచ్చేసారు. ఇక ఈ నెల 25 న తన కొత్త రాజకీయ పార్టీ పేరుతో పాటుగా పార్టీ జెండా, ఎజెండా కూడా ప్రకటించేందుకు కవిత సిద్ధమయ్యారు. ఆ లోపు కవిత కొత్త రాజకీయ పార్టీ సినిమాకి గ్లిమ్స్ మాదిరి కేటీఆర్ టార్గెట్ గా విమర్శలు సంధించారా.?
ఇక ట్రైలర్, సినిమా తో రాబోయే రోజులలో ఈ అన్నా చెల్లెళ్ళ రాజకీయ పోరు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే కవిత తన వంతుగా ఆట ముందు మొదలు పెట్టేసారు. మరి కేటీఆర్ తన ఆటను ఎక్కడ నుంచి మొదలు పెట్టి ఎక్కడ ముగిస్తారో.? ఈ ఆటలో అన్న రాజకీయ ఎత్తుగడలు ఫలిస్తాయో.? చెల్లి పంతం నెరవేరుతుందో చూడాలి.




