కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి గెంటివేయబడిన తర్వాత కూడా చాలా రోజులు కేసీఆర్ ఫోటో పెట్టుకొని ఆయనని వెనకేసుకు వస్తూ మాట్లాడేవారు. కానీ ఇప్పుడు అయన ఫోటో తీసేశారు. తండ్రిని నేరుగా నిందించకపోయినా తన తండ్రి హయంలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని చెపుతున్నారు.
తండ్రి హయంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని చెప్తున్నారు. తండ్రి హయంలో రాష్ట్రంలో పెద్దగా అభివృద్ధి జరగలేదని ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని కవిత ఆరోపిస్తున్నారు.
కవితలో ఈ మార్పు దేనికంటే, ఎప్పటికైనా తండ్రి నుంచి పిలుపు రాకబోతుందా? మళ్ళీ బీఆర్ఎస్ గూటికి చేరకపోతానా? అని ఇంతకాలం ఎదురు చూశారనుకోవచ్చు. అందుకే ఇంతకాలం ఆమె తండ్రి ఫోటో పెట్టుకొని రాజకీయ కాలక్షేపం చేశారు.
కానీ ఆమె అనుకున్నవిధంగా జరుగకపోగా, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆమెపై, ఆమె భర్త అనిల్ కుమార్పై కత్తులు దూశారు. కేసీఆర్ అనుమతి లేనిదే వారు ఆవిధంగా మాట్లాడే సాహసం చేయరు.
కనుక తండ్రి ఇక తనని దూరంగా ఉంచడమే కాకుండా శత్రువుగా చూస్తున్నారని కవిత కూడా గ్రహించారు. అందుకే ఈ మార్పు… ఈ యుద్ధాలు!
ఆమె నిన్న భువనగిరిలో పర్యటించినప్పుడు “నేను బీఆర్ఎస్ పార్టీలో 20 ఏళ్ళు పనిచేశాను. కనుక ఆ పార్టీ హయంలో జరిగిన తప్పులకు నేను కూడా బాధ్యురాలినే అవుతాను. కానీ అప్పుడు నన్ను నిజామాబాద్ జిల్లాకే పరిమితం చేయడం వలన మాట్లాడలేకపోయాను. ఇప్పుడు నాకు ఆ పార్టీతో సంబంధం లేదు. కనుక తప్పొప్పుల గురించి మాట్లాడగలుగుతున్నాను,” అని అన్నారు.
అంటే ఆమె పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నప్పుడు కళ్ళెదుటే తప్పులు, అవినీతి, అక్రమాలు జరుగుతున్నా మౌనం వహించారు. తన తండ్రిని, అన్నని, పార్టీని, ప్రభుత్వాన్ని వెనకేసుకు వస్తూ అద్భుతంగా పనిచేస్తున్నారని నాడు ప్రజలకు అబద్దాలు చెప్పానని కవిత ఇప్పుడు ఒప్పుకుంటున్నారన్న మాట!
కన్న కూతురు ఈవిధంగా తన పార్టీని, ప్రభుత్వాన్ని, పాలనని వేలెత్తి చూపుతున్నప్పుడు, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ముందు ఆమెకు సమాధానం చెప్పి ఉండాలి. కానీ ఆమె ప్రశ్నలకు, ఆరోపణలకు జవాబులు చెప్పకుండా తమని తాము పొగుడుకుంటున్నారు!
అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురూ ఆత్మవంచన చేసుకుంటూ పార్టీ శ్రేణులను, ప్రజలను కూడా భ్రమింపజేయాలనుకుంటున్నారనే కదా అర్ధం?






