కేసీఆర్‌కు ఒకటే దారి… మోడీ నమస్మరామి?

KCR NArendra Modi

పదేళ్ళకు పైగా సాగిన తెలంగాణ ఉద్యమాలలో, ఆ తర్వాత మరో పదేళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాజకీయాలను కంటి సైగతో కేసీఆర్‌ శాశించారని అందరికీ తెలుసు. ఇదే ఊపులో ఆయన దేశ రాజకీయాలను కూడా శాశించాలనుకున్నారు. ఒకవేళ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యుంటే తప్పకుండా అదీ చేసేవారేమో?

కానీ అనూహ్యంగా కాంగ్రెస్‌ చేతిలో ఓడిపోవడంతో తెలంగాణ గడప దాటి అడుగు బయట పెట్టలేని స్థితిలో ఉన్నారు. అసలు ఈ ఓటమి కేసీఆర్‌కు చాలా పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే అపర చాణక్యుడైన కేసీఆర్‌ని ఎదుర్కోవడం ఎవరి వల్లా కాదని, రేవంత్‌ రెడ్డికి నోటి దురద తప్ప మరేమీ చేతకాదని బిఆర్ఎస్ పార్టీలో అందరూ గుడ్డి నమ్మకంతో ఉండేవారు.

ADVERTISEMENT

నిజానికి కేసీఆరే వారందరికీ అటువంటి గుడ్డి నమ్మకం కలిగించారని చెప్పవచ్చు. అందుకే కేసీఆర్‌ జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్‌ ప్రత్యేక విమానాలు వేసుకొని దేశాటన చేస్తున్నప్పటికీ అభ్యంతరం చెప్పలేదు.

దేశంలో ఏ పార్టీ కూడా తమతో కలవకపోవడం వలననే కేసీఆర్‌ టిఆర్ఎస్‌ పేరుని బిఆర్ఎస్ పార్టీగా పేరు మార్చారని తెలిసి ఉన్నప్పటికీ ఎవరూ అభ్యంతరం చెప్పలేదు.

కీలకమైన శాసనసభ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ మహారాష్ట్రలో చక్కర్లు కొడుతున్నప్పటికీ పార్టీలో ఎవరూ తప్పుపట్టలేదు.

ఎందుకంటే కేసీఆర్‌పై అంత గుడ్డి నమ్మకం వారికి. ఆయన మంత్ర దండం తిప్పేసి బిఆర్ఎస్‌ని గెలిపించేస్తారని అందరూ గుడ్డిగా నమ్మారు కనుక!

కానీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కేసీఆర్‌ నిర్ణయాలలో చాలా తప్పులే కనిపిస్తున్నాయి వారందరికీ. అందుకే పార్టీ పేరుని మళ్ళీ టిఆర్ఎస్‌గా మార్చుకొనే ఆలోచనలు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలలో ఇతర రాష్ట్రాలలో పోటీ చేసే ఆలోచనలు విరమించుకొని, తెలంగాణకు మాత్రమే పరిమితం అవుతున్నారు.

కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలన్నీ తప్పని బిఆర్ఎస్‌ నేతలు ప్రస్తుతం చాలా మృదువుగా చెప్పుకుంటున్నప్పటికీ, ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీ ఎంపీ సీట్లు తగ్గిపోతే వారందరూ మరింత స్పష్టంగా కేసీఆర్‌ తీరుని తప్పు పట్టవచ్చు. అప్పుడు కేసీఆర్‌ని వ్యతిరేకించేవారు లేదా కేసీఆర్‌ వద్దనుకునేవారు కాంగ్రెస్‌లోకి జంప్ అయిపోవడం ఖాయమే.

బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల వలసలు మొదలైతే వాటిని కేసీఆర్‌ కూడా ఆపలేరు. కనుక అవి మొదలవకుండా చేయడంపైనే బిఆర్ఎస్‌ మనుగడ ఆధారపడి ఉంటుంది.

ఓ పక్క కేసీఆర్‌ తలపై ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కత్తి వ్రేలాడుతూనే ఉంది. మరోపక్క రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూడా కేసీఆర్‌, కేట్, హరీష్ రావులతో సహా బిఆర్ఎస్‌ నేతలందరి మెడలకు ఉచ్చు బిగించేందుకు అనేక కేసులు సిద్దం చేస్తోంది.

ఇదివరకు కేసీఆర్‌ నుంచి రక్షణ కోసం ఈటల రాజేందర్‌ వంటివారు బీజేపీలో చేరితే, ఇప్పుడు ఈ కేసులు, పార్టీని చక్కదిద్దుకోవడం కోసం కేసీఆర్‌ స్వయంగా మోడీ పంచన చేరి బీజేపీ రక్షణ కవచం ధరించక తప్పదు. కేసీఆర్‌కు వేరే దారి లేదు కూడా. బహుశః లోక్‌సభ ఎన్నికల తర్వాత కేసీఆర్‌ ఇదే చేయవచ్చు.

ADVERTISEMENT
Latest Stories