తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2023 లో కూడా తనదే అధికారం, తన పార్టీదే ప్రభుత్వం అంటూ హ్యాట్రిక్ విజయం మీద గంపెడాశలు పెట్టుకున్నారు.
కానీ కేసీఆర్ హ్యాట్రిక్ కలను పగటి కలగా మార్చి పదేళ్ల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించారు రేవంత్ రెడ్డి. అలాగే అధిష్టానం ఆశీస్సులతో ముఖ్యమంత్రి పదవి సాధించారు. అయితే మరి నాడు తన గులాబీ కారు హ్యాట్రిక్ కు బ్రేకులు వేసిన రేవంత్ నేడు మరోరూపంలో కేసీఆర్ కి హ్యాట్రిక్ అందించారు.
అసలు విషయానికొస్తే., తెలంగాణలో బిఆర్ఎస్ గద్దె దిగి కాంగ్రెస్ అధికార పీఠం దక్కించుకున్న ఈ రెండేళ్ల సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికి మూడు కేసుల విషయంలో అధికారుల నుండి నోటీసులు అందుకుని హైట్రిక్ కొట్టారనే చెప్పాలి.
* మొదటగా.. రేవంత్ సర్కారు హయాంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన PPA విధానాల పై విచారణ అంటూ జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ కేసీఆర్ కి నోటీసులు అందించింది. అయితే ఈ నోటీసుల పై కేసీఆర్ హైకోర్టు ను ఆశ్రయించారు.
* రెండు.. బిఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ కూలడం పై కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జస్టిస్ ఘోష్ కమిషన్ నుండి విచారణకు హాజరవ్వాలి అంటూ నోటీసులు అందుకున్నారు. అయితే ఈ అంశం పై కేసీఆర్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు.
* ఇక ముచ్చటగా మూడు.. తెలంగాణలో సంచలంగా మారిన ఫోన్ టాపింగ్ కేసు విచారణ నిమిత్తం ఇప్పుడు కేసీఆర్ సిట్ నోటీసులు అందుకునే పరిస్థితికి వచ్చారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో పలువురు సినీ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, వ్యాపారుల ఫోన్లు టాపింగ్ కి గురయ్యాయని, అయితే దీని వెనుక ఉన్న ఆ అసలు సూత్రదారులు, పాత్రధారులు ఎవరన్నది నిగ్గుతేల్చే పనిలో ఉన్న సిట్ గత ప్రభుత్వ మంత్రులైన కేటీఆర్, హరీష్ లతో పాటుగా మాజీ ఎంపీ సంతోష్, మాజీ ముఖ్యమంత్రికి సైతం నోటీసులు అందచేసారు.
ఈ నేపథ్యంలో కేసీఆ,ర్ రేవంత్ సర్కార్ హయాంలో వరుసగా మూడు కేసులలో నోటీసులు అందుకుని హ్యాట్రిక్ కలను ఈ రకంగా నెరవేర్చుకున్నారనే చెప్పాలి. ఇక రానున్న రోజులలో ఈ నోటీసులు, కేసులుగా మారి ఎవరిని దోషులుగా తెలుస్తుందో చూడాలి..!






