రాజకీయాలు రాన్రాను మరీ విచిత్రంగా మారిపోతున్నాయి. ప్రత్యర్ధులను రాజకీయంగా ఎదుర్కోలేనప్పుడు వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. అవసరమైతే రాజకీయాలతో సంబంధం లేని ఇంట్లో ఆడవాళ్ళని టార్గెట్ చేయడానికీ వెనకాడటం లేదు.
ఏపీ రాజకీయాలలో ప్రత్యర్ధులను మానసికంగా దెబ్బ తీసే ఈ విధానం మొదలై చాలా కాలమే అయ్యింది. తాజాగా తెలంగాణలో కూడా మొదలైంది. అయితే ఇది మరో రకమైన సైకలాజికల్ రాజకీయ ప్రయోగం.
తెలంగాణలో కాంగ్రెస్, బిజేపి నేతలు తమ రాజకీయ ప్రత్యర్ధి.. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పట్ల సానుభూతి చూపుతూ, ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు!!!
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేయడాన్ని కాంగ్రెస్, బిజేపి నేతలు తప్పు పడుతున్నారు. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ని సొంత కూతురే ఆవిధంగా చులకనగా మాట్లాడటం తగదని, ఆమె మాటలతో కేసీఆర్ మానసికంగా మరింత క్రుంగిపోతారని కాంగ్రెస్, బిజేపి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరో పదేళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో బ్రతకాల్సిన కేసీఆర్ ఈ మానసిక క్షోభ తట్టుకోలేరని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు!
వారు కవిత తీరుని తప్పు పడుతున్నట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ, ఆమె వాళ్ళ కేసీఆర్ ఆరోగ్యం పాడైపోతుందని ఆందోళన వ్యక్తం చేయడం ఓ మైండ్ గేమ్ అనిపిస్తుంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కూతురు కవిత చిక్కుకొని జైలు పాలైనప్పుడు తండ్రిగా కేసీఆర్ మనసు చాలా క్షోభించి ఉండవచ్చు.
ఆ తర్వాత కవితని పార్టీ నుంచి బహిష్కరించడం, ఆమె జాగృతి, టీఆర్ఎస్ పార్టీ పేరుతో చేస్తున్న రాజకీయాలు, విమర్శలతో కేసీఆర్ బాధపడకుండా ఉండరు.
అందుకే కేటీఆర్ కవితని ఉద్దేశ్యించి “తల్లితండ్రులకి మేలు చేయకపోయినా బాధ పెట్టరాదని” సున్నితంగా మందలించారు.
కానీ ఆమె విమర్శలపై కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలెవరూ స్పందించడం లేదు. కానీ కాంగ్రెస్, బిజేపి నేతలు స్పందిస్తున్నారు. దేనికి? అంటే అర్థం ఏమిటి?అంటే కవితని మందలిస్తూ కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేయడం సైకాలాజికల్ అటాక్ అని భావించవచ్చు. ఈవిధంగా కేసీఆర్ మరింత క్రుంగిపోయేలా చేసి రాజకీయాల నుంచి తప్పుకునేలా చేయాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది.




