కేసీఆర్ రాజకీయ మౌనం తుఫాన్ ముందు వచ్చే నిశబ్దమా లేక ఓటమి తరువాత వచ్చే నిస్సహాయతా.? అనేది ఇప్పటికి తెలంగాణ ప్రజలకు అవగతం అవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తున్నా ఇంకా కేసీఆర్ రేవంత్ పాలన పై పెదవి విప్పలేకపోతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చెయ్యాలన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కౌంటర్లు వెయ్యాలన్నా ఆ బాధ్యతను మేనల్లుడు హరీష్ రావు, కొడుకు కేటీఆర్ భుజానకెత్తుకోవడంతో మెల్లిమెల్లిగా కేసీఆర్ ఊసు తెలంగాణ రాజకీయాల నుండి దూరంగా జరిగిపోతుంది. దీనికి కేసీఆర్ మౌనం ఒక కారణమైతే కేటీఆర్, హరీష్ దూకుడు మరో కారణంగా చెప్పవచ్చు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి మరణానంతరం కేసీఆర్ ప్రభంజనం మొదలయ్యిందనే చెప్పాలి. ఇక అక్కడి నుంచి ప్రత్యేక తెలంగాణ సాధించడం, ఆ రాష్ట్రానికి దశాబ్దం పాటు ఏకచక్రాధిపత్యంగా అధికారం అనుభవించడం, ప్రత్యర్థులను తన కనుసన్నలలో శాసించడం కేసీఆర్ రాజకీయ జీవితంలో అత్యంత ఉన్నతమైన రోజులుగా భావించాలి.
అయితే అప్పుడు కేసీఆర్ ఎంత దర్జాగా రాజకీయాలు చేసారో ఇప్పుడు అంత సైలెంట్ గా రాజకీయాలకు దూరమవుతున్నారు. ఒకప్పుడు తన తెగింపుతో చరిత్ర సృష్టించిన కేసీఆర్ ఇప్పుడు తన నిస్సహాయతతో పార్టీ నేతల సహనాన్నిపరీక్షిస్తున్నారు. మీనమేషాలు లెక్కించి మాట్లాడడానికి, శుభముహూర్తాలు చూసుకుని చేసుకోవడానికి జరుగుతుంది పెళ్ళోపెరటమో కాదు రాజకీయం అంటూ పార్టీ శ్రేణులు సైతం కేసీఆర్ తీరు మీద గుర్రుగా ఉన్నారు.
వర్జాలు, హోమాలు పదవిని కాపాడలేవని, అధికారాన్ని కట్టపెట్టలేవని కేసీఆర్ కు అనుభవపూర్వకంగా తెలిసినప్పటికీ తానూ ప్రజా క్షేత్రంలోకి రావాలంటే ఇంకా కాలెండర్ లో తేదీ మారాలి అంటూ మౌన ముద్రలో ఉన్న కేసీఆర్ ఆ సమయం వచ్చే వరకు ప్రజలను వేచి ఉండమని చెప్పగలరా.? గత పదేళ్లు విజయ గర్వంతో పక్క రాష్ట్ర రాజకీయాల్లో కూడా తలపెట్టిన కేసీఆర్ ఇప్పుడు ఓటమి ఇచ్చిన మౌనంతో తన సొంత రాష్ట్ర రాజకీయాలలో కూడా వేలు పెట్టలేకపోతున్నారు.
అప్పుడు జగన్ కు సాయం అందించిన కేసిఆర్ ఇప్పుడు జనం సాయం కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలో హైద్రాబాద్ లో జరిగే GHMC ఎన్నికలలో ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి తమ ఓటుతో సాయమందిస్తే తప్ప కేసీఆర్ రాజకీయంలో దూకుడు పెంచే అవకాశం లేదు.




