తెలంగాణలో ప్రతిపక్ష నేతగా ఉన్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వివాదం పై ఎందుకో నోరెత్తడం లేదు. ఒక కేంద్ర మంత్రి తనయుడి మీద పోక్సో కేసు అంటే అది ముఖ్యంగా టి. బీజేపీ కి పెద్ద రాజకీయ ఎదురుదెబ్బగానే భావించాలి.
అయితే తెలంగాణలో కుదిరితే అధికార పక్షంగా లేకుంటే కనీసం ప్రతిపక్షంగా అయినా తన సత్తా చాటాలనుకుంటున్న టి.బీజేపీ ఇప్పుడు తమ పార్టీలో కీలక నేత కుటుంబం ఇలా పోక్సో వివాదంలో ఇరుక్కోవడంతో రాజకీయంగా ఇరకాటంలో పడిపోయింది.
అటు మీడియా ఇటు సోషల్ మీడియాలో బండి భగీరథ్ కి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుంది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీనత పైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి. బండి భగీరథ్ పై కేసు నమోదయ్యి వారం రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోలేకపోతుందా.?
చట్టం సామాన్యుల విషయంలో కఠినంగా బడా వ్యక్తుల విషయంలో బలహీనంగా పనిచేస్తుందా అంటూ కాంగ్రెస్ పై విమర్శలు మొదలయ్యాయి. ఇలా ఒక్క పోక్సో కేసు అటు అధికార కాంగ్రెస్ ని ఇటు మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టింది.
ఇటువంటి తరుణంలో ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ బాధితుల పక్షాన పోరాటం చేసి వారికీ మద్దతు ప్రకటించి ఉంటే అది బిఆర్ఎస్ కు రాజకీయంగా సానుకూల అంశంగా మారేది. కానీ పార్టీ అధినేతగా కేసీఆర్ ఈ వివాదం పై ఇంత వరకు నోరు మెదపలేదు, బాధితులకు అండగా ఉంటామంటూ వారికీ తమ పార్టీ నుంచి మద్దతు ప్రకటించలేదు.
దీనితో అసలు బీజేపీ పై కేసీఆర్ ఎందుకింత మౌనం పాటిస్తున్నారు.? గతంలో తన సొంత కుమార్తె కవిత అరెస్టు విషయంలో కూడా కేసీఆర్ బీజేపీ కి వ్యతిరేకంగా గళం విప్పలేకపోయారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత దాదాపు ఆరు మాసాలు తీహార్ జైల్లో ఉన్నప్పటికీ, బీజేపీ నేతలు కవితను లిక్కర్ డాన్ అంటూ వేలెత్తి చూపినప్పటికీ కేసీఆర్ మాత్రం మౌనాన్నే ఆశ్రయించారు.
ఇక ఇప్పుడు బీజేపీ నేత కుమారుడు ఏకంగా ఫోక్సో కేసు ఎదుర్కొంటు ముందస్తు బైళ్ళ కోసం న్యాయస్థానాల చుట్టూ న్యాయ పోరాటాలు చేస్తున్నా ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ బండి భగీరథ్ కు వ్యతిరేకంగా ఒక్క ప్రకటన కూడా చెయ్యలేదు వై.? అన్న చర్చ బిఆర్ఎస్ శ్రేణులలో కూడా జరుగుతుంది.
కేసీఆర్ మౌనం వెనుక భవిష్యత్ రాజకీయ ప్రణాళికలు ఉన్నాయా.? లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై నోరెత్తి విమర్శలు చేస్తే రాష్ట్రంలో తమ పై నమోదైన కాళేశ్వరం, ఫోన్ టాపింగ్, ఈ ఫార్ములా రేస్ కేసులు బయటకు వస్తాయేమో అన్న భయం కేసీఆర్ నోరు నొక్కేస్తుందా.?




