ఏ పార్టీ అధినేతలైనా తమ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తుంటారు. కనుక తెలంగాణ రాష్ట్రం సాధించి, పదేళ్ళపాటు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ దిశానిర్దేశం చాలా గొప్పగా ఉండాలి.
కానీ తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు ముగింపు సభలో కేసీఆర్ ప్రసంగం విన్నప్పుడు స్పష్టత కంటే సందేహాలే కలుగుతాయి. ఎలాగో చూద్దాం..
“పార్టీలో కొంత మంది నాయకులు ప్రజల మధ్యకు వెళ్ళకుండా సోషల్ మీడియాలో కనిపిస్తే చాలనుకుంటున్నారు. అలాంటి వారికి వచ్చే ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలైనా టికెట్స్ ఇవ్వను,” అన్నారు.
మరైతే కేసీఆర్ ప్రజల మధ్యకు వెళ్తున్నారా? శాసనసభ సమావేశాలకు వెళ్తున్నారా? కనీసం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రోజూ వెళ్తున్నారా? కార్యకర్తలు సైనికుల్లా క్రమశిక్షణతో పనిచేయాలని చెపుతున్నప్పుడు కేసీఆర్ క్రమశిక్షణ పాటిస్తున్నారా? కార్యకర్తలతో మాట్లాడుతున్నారా?అంటే సమాధానం అందరికీ తెలుసు.
తాను ఆచరించనివి పార్టీ నేతలు ఆచరించాలని లేకుంటే టికెట్స్ ఇవ్వనని బెదిరించడాన్ని ఏమనుకోవాలి?ఆ లెక్కన కేసీఆర్ కూడా టికెట్ తీసుకోకూడదు కదా?
“తెలంగాణ రాష్ట్రాన్ని ఇంతగా అభివృద్ధి చేసినా ప్రజలు మనల్ని ఎందుకు ఓడించారు?మనకి 60 లక్షల మంది సభ్యులున్నా ఎందుకు ఓడిపోయాము? పార్టీలో ప్రతీ ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి,” అని కేసీఆర్ అన్నారు.
“పార్టీ గెలిస్తే పూర్తి క్రెడిట్ కేసీఆర్ ఒక్కరే తీసుకుంటారు. కనుక ఓటమికి కూడా ఆయనే పూర్తి బాధ్యత తీసుకోవాలి. కానీ తీసుకోలేదు. పార్టీ ఓటమికి అందరూ కారణమని నిందిస్తున్నారు.
పార్టీ ఎందుకు ఓడిపోయిందో చెప్పాల్సిన కేసీఆర్, ఎందుకు ఓడిపోయామని కార్యకర్తలని అడుగుతున్నారు! ఓటమి తర్వాత మొట్ట మొదట ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన వ్యక్తి ఆయనే. కానీ అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలంతున్నారు.
కేసీఆర్ స్థాయి నాయకుడు ప్రజాతీర్పుని గౌరవించి ఓటమిని అంగీకరిస్తున్నామని చెప్పాలి. తప్పులు జరిగాయని, వాటిని సరిదిద్దుకుంటామని చెప్పాలి. కానీ తనని కాదని కాంగ్రెస్ ఎన్నుకొని మోసపోయారని అనుభవించాల్సిందేనంటూ ప్రజలను కూడా శపిస్తున్నారు! మళ్ళీ నేనే సిఎం అంటున్నారు. అంటే ఆయన ప్రజా తీర్పుని గౌరవించనప్పటికీ, ప్రజలు తనని గౌరవింఛి సిఎం పదవి ఇవ్వాలని ఆశిస్తున్నారన్న మాట!
“పార్టీలో కొందరు నేతలు అహంభావంతో వ్యవహరిస్తున్నారు. ఇది సరికాదు. ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడాలి,” అని అన్నారు.
కానీ తన అహంభావం, నిరంకుశత్వం, అప్రజాస్వామిక విధానాల వల్లనే పార్టీ ఓడిపోయిందని అంగీకరించడానికి నేటికీ కేసీఆర్కి అహం అడ్డొస్తోంది.
అహంకారం కూడదంటూనే టికెట్స్ ఇవ్వనని పార్టీ నేతలను, తనను ఓడించినందుకు సిఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని, చివరికి ప్రజలను కూడా నిందిస్తున్నారు కదా?
ఈవిధంగా కేసీఆర్ ఫామ్హౌసులో కాలక్షేపం బయటకు వచ్చిన ప్రతీసారి ప్రజలని, పార్టీ నేతలని, కార్యకర్తలని, ప్రభుత్వాన్ని అందరినీ నిందిస్తూ అందరూ కలిసి నన్ను ముఖ్యమంత్రిని చేయాలని ఆశిస్తుండటం మరీ విడ్డూరంగా ఉంది కదా? ఇలాగేనా… దిశానిర్దేశం?







