కొడాలి నాని ముంబైకి.. అక్కడి నుంచి అమెరికా వెళ్ళరుగా?

ysrcp-kodali-nani-

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురవడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌ చేరారు. యాంజియో పరీక్షలలో గుండె రక్త నాళాలలో మూడు బ్లాకులున్నట్లు గుర్తించారు.

ADVERTISEMENT

ఆ హాస్పిటల్లో స్టంట్స్ వేయడం లేదా బైపాస్ ఆపరేషన్స్ నిత్యం జరుగుతూనే ఉంటాయి. కానీ మెరుగైన వైద్యం కొరకు కుటుంబ సభ్యులు కొడాలి నానిని సోమవారం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో ముంబై తీసుకువెళ్ళారు. అక్కడ ఆయన బైపాస్ సర్జరీ చేయించుకుంటారని సమాచారం.

కొడాలి నాని, అనుచరులపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాతే ఆయనకు ఆరోగ్య సమస్యలు మొదలవడం గమనిస్తే స్టాండర్డ్ రాజకీయ ఫార్ములా ప్రకారమే జరిగినట్లు అనిపిస్తుంది.

గతంలో ఆయన చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, వారి కుమారుడు నారా లోకేష్‌ల గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు. కనుక అందుకు మూల్యం చెల్లించక తప్పదని ఆయనకు బాగా తెలుసు. ఈ కేసులు, పోలీసులు, అరెస్టులకు భయపడే రకం కాదని కొడాలి నాని పదేపదే చెప్పుకున్నప్పటికీ టీడీపీ ప్రతీకారం ఏ స్థాయిలో ఉంటుందో అనే ఆందోళన పెరిగిపోయి బైపాస్ చేయించుకోవలసిన పరిస్థితి కలిగించి ఉండొచ్చు.

కనుక ఆయన ముంబైలో బైపాస్ సర్జరీ చేయించుకోబోతుండటం నిజమే అయితే త్వరగా కొలుకొని గుడివాడ తిరిగివచ్చి పూర్తి ఆరోగ్యంతో ఈ కేసుని ఎదుర్కోవాలని ఆశిద్దాం.

ఆంధ్రా రాజకీయ నాయకులు తమ ప్రాణాలు చాలా విలువైనవని భావిస్తుంటారు కనుక విజయవాడలోనే అనేక ప్రముఖ హాస్పిటల్స్ ఉన్నప్పటికీ హైదరాబాద్‌ వెళ్ళి వైద్యం చేయించుకువస్తుంటారు. కనుక కొడాలి నాని కూడా అలాగే వెళ్ళారని సరిపెట్టుకోవచ్చు. కానీ హైదరాబాద్‌ కంటే మెరుగైన వైద్య కోసం ముంబయి వెళ్ళిన కొడాలి నాని, మరింత మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి అమెరికా విమానం ఎక్కినా ఆశ్చర్యం లేదు. కనుక ఈ గుండెపోటుకి ఎక్కడ ఎప్పుడు ఉపశమనం లభిస్తుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories