“నారా లోకేష్ ఎర్ర డెయిరీ చూపిస్తే అందరం ఊరికే భయపడ్డాము… మూడు నెలలు గడిచిపోయాయి. మనకి ఏం కాలేదు. మన జోలికి ఎవరూ రాలేదు. ఇక ఎవరికీ వచ్చే ధైర్యం కూడా లేదు. కనుక ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడవచ్చు…” అని గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని అనుకున్నారో ఏమో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సిఎం చంద్రబాబు నాయుడుని ఉద్దేశ్యించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“నేను ముప్పై సార్లు తిరుమల వెళ్ళి గుండు కొట్టించుకున్నాను. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా గుండు కొట్టించుకున్నారా?” అంటూ పనికిరాని ప్రశ్నలు వేస్తూ విమర్శలు గుప్పించారు. కొడాలి నాని విమర్శలపై టిడిపి నేతలు ఎవరూ స్పందించకపోవడం ఇంకా ఆశ్చర్యం కలిగిస్తుంది.
కొడాలి నానిని బెదరగొడితే మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే చేతికి దొరకడు కనుక ఆయన నాలుగు తిట్లు తిట్టినా భరిద్దామని సిఎం చంద్రబాబు నాయుడు టిడిపి నేతలకు చెప్పారో ఏమో? టిడిపి నేతలు ఎవరూ స్పందించలేదు. కనుక వారు ఊహించిన్నట్లే కొడాలి నాని మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి వాగకుండా ఉండరు.
ఆయనను చూసి వైసీపిలో మిగిలినవారు కూడా ధైర్యం తెచ్చుకొని టిడిపి సిఎం చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేందుకు కలుగుల్లో నుంచి బయటకు వస్తారు. బహుశః వారిని బయటకు రప్పించేందుకే చంద్రబాబు నాయుడు టిడిపి నేతలను మాట్లాడకుండా కట్టడి చేస్తున్నారేమో?
టిడిపి అధికారంలోకి రాగానే వైసీపి నేతల భరతం పట్టాలని టిడిపి నేతలు చాలా ఆశపడ్డారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు వారందరినీ కట్టడి చేయడంతో తీవ్ర అసహనానికి లోనయ్యారు.
అయితే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారాన్ని బయటపెట్టిన తర్వాత వైసీపి, జగన్ పరిస్థితిని చూస్తున్నవారందరూ చాలా సంతోషిస్తూనే ఉంటారు. సిఎం చంద్రబాబు నాయుడు తమలాగ ఆవేశపడకుండా, తొందరపడకుండా పావులు కదిపితే ఫలితం ఏవిదంగా ఉంటుందో ఇప్పుడు టిడిపిలో అందరికీ అర్దమయ్యే ఉంటుంది.
కనుక ఎర్ర డెయిరీలో కొడాలి నానికి చేయాల్సిన ట్రీట్మెంట్ వివరాలు త్వరలోనే తెలియవచ్చు. ఆలోగా కొడాలి నానికి కాస్త ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం చాలా అవసరమే.




