ఆంధ్రులు గర్వంగా చెప్పుకోవలసిన అమరావతిపై ‘వేశ్యల రాజధాని’ ముద్ర వేసిన ఘనుడు కొమ్మినేని శ్రీనివాసరావు. ఆ కేసులో ఈ నెల 9 వ తేదీన అరెస్ట్ కాగా, 10న మంగళగిరి కోర్టు 2 వారాలు జ్యూడిషియల్ రిమాండ్ విధించడంతో గుంటూరు జైల్లో పడ్డారు.
కనుక ఆ తర్వాత కస్టడీ విచారణ, బెయిల్, జగన్ పరామర్శ ఎపిసోడ్స్ ఉంటాయని అందరూ అనుకుంటే, హైకోర్టుకి వెళ్ళకుండా నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చేసుకున్నారు! ఆయన తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేయగానే వెంటనే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం విచారణ చేపట్టడం, వెంటనే బెయిల్ మంజూరు చేయడం చాలా ఆశ్చర్యకరమే.
కొమ్మినేని 70 ఏళ్ళ వృద్ధుడనే న్యాయవాదుల వాదనలు ఫలించాయా లేదా ఆయనకున్న ‘జర్నలిస్ట్ ముద్ర’ ఉపయోగపడిందో కానీ ఇలా వెళ్ళి అలా బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చేస్తున్నారు.
ఇకపై మళ్ళీ అటువంటి అసభ్య వ్యాఖ్యలు చేయవద్దని, ఎవరైనా చేస్తే ప్రోత్సహించవద్దని సున్నితంగా మందలించి సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ షరతుల గురించి మంగళగిరి కోర్టులో మాట్లాడుకోమని చెప్పింది. కనుక కొమ్మినేనికి మూడు రోజులలోనే జైలు నుంచి విముక్తి లభించబోతోంది.
ఓ ‘వృద్ద జర్నలిస్ట్’కి బెయిల్ లభించినప్పుడు మరో వృద్ధ జర్నలిస్టు కృష్ణంరాజుకి కూడా బెయిల్ లభించడం ఖాయమే అని భావించవచ్చు. అయితే కొమ్మినేని జగన్ మనసాక్షి కనుక న్యాయవాదులను సుప్రీంకోర్టుకి పరిగెత్తించి విడిపించుకు వచ్చారు. కానీ తన కళ్ళలో ఆనందం చూసేందుకు అమరావతిపై ఇంత బురద జల్లిన కృష్ణంరాజుకి జగన్ ఈ ఫెసిలిటీ కల్పిస్తారో లేదో?




