తెలుగు సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం తరుపున అన్ని రకాలుగా అండగా నిలబడతాం, ఏపీలో కూడా తెలుగు ఇండస్ట్రీని అభివృద్ధి చేయండి దానికి తమ సంపూర్ణ సహకారం ఉంటుంది అంటూ స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాలలో సినీ ప్రముఖులను అభ్యర్ధించారు.
సీఎం అభ్యర్థనలు ఏమాత్రం పట్టించొకపోగా విశాఖ లో నిర్మాణంలో ఉన్న స్టూడియో పనులకు కూడా రాజకీయ కారణాల అవరోధాల వలన అడ్డుకట్ట వేసుకుంటున్నాం అంటూ ప్రకటించారు ప్రముఖ నిర్మాత దగ్గుపాటి సురేష్. తెలుగు సినీ మాటల రచయిత కోన వెంకట్ కూడా ఇప్పుడు అదే కోవలోకి వచ్చి తన ఆవేదనను తెలియచేసారు.
బాపట్ల సముద్రతీరంలో సినీ స్టూడియో నిర్మించాలన్న తన చిరకాల వాంఛకు “రాజకీయ గ్రహణం” పట్టిందంటూ తన బాధను పంచుకున్నారు. ఏపీలో కూడా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తనకు ఎంతో ఇష్టమైన బాపట్ల సముద్ర తీరంలో స్టూడియో నిర్మించాలి అనే ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని రాజకీయ కోణంలో ప్రచారం చేయడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకోవలసి వచ్చిందంటూ తెలియచేసారు.
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత సినీ ఇండస్ట్రీకి సంబంధించి తీసుకున్న అన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారడంతో అసలు వైసీపీ ప్రభుత్వంలో “సినిమా పరిశ్రమకే రాజకీయ గ్రహణం” పట్టింది అంటూ విమర్శలు ఎక్కుపెడుతున్నారు సినీ ప్రేమికులు. మరి ఈ రాజకీయ గ్రహణాలు వీడడానికి ఎంత సమయం పడుతుంది అనేది రానున్న కాలంలో తెలుస్తుంది.




