మాజీ సిఎంలు కేసీఆర్, జగన్కు మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఇద్దరూ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా వారి మధ్య సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇది జగన్ వన్ సైడ్ లవ్ అనే చెప్పొచ్చు.
ఏవిధంగా అంటే, ఏపీలో జగన్ బలప్రదర్శనలలో కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో కూడిన బ్యానర్లు ప్రదర్శిస్తుంటారు. అలాగే నేడు ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయ శర్మ కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు జగన్ హైదరాబాద్ వచ్చినప్పుడూ ఆయనకు స్వాగతం పలుకుతూ పలు ప్రాంతాల్లో ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిలో జగన్ ఫొటోతో పాటు కేసీఆర్, కేటీఆర్లతో కలిసి ఉన్న ఫొటోలు కూడా కనిపించాయి.
అయితే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ దయనీయ స్థితిలో ఉందని, కనీసం సరైన రోడ్లు కూడా లేవంటూ ఎద్దేవా చేసేవారు. అలాగే నదీ జలాల వివాదాల పరిష్కరించుకునేందుకు కేసీఆర్ ఏమాత్రం జగన్కు సహకరించలేదు. పైగా జగన్ మూడు రాజధానులు అంటూ కాలక్షేపం చేస్తుంటే, ఆంధ్రాకు రావాల్సిన పరిశ్రమలు, పెట్టుబడులను కేటీఆర్ తెలంగాణకు తరలించుకుపోయారు.
ఒకవేళ టూవే లవ్ అయితే కేసీఆర్, కేటీఆర్ ఇలా వ్యవహరించకూడదు కదా? కనుక జగన్ ప్రేమ వన్ సైడ్ లవ్ అని చెప్పక తప్పదు.
జగన్ ఇప్పటికే అమరావతిని, పరిశ్రమల స్తాపనని, చివరికి డీఎస్సీ ఉద్యోగాల భర్తీని తప్పు పడుతూ చేస్తున్న రాజకీయాల కారణంగా ఆంధ్రా ప్రజలలో వ్యతిరేకత పెంచుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రాని శత్రువులుగా భావిస్తున్న కేసీఆర్, కేటీఆర్లు నా ఆప్తమిత్రులన్నట్లు జగన్ పోస్టర్స్ వేసి మరీ చాటింపు వేసుకుంటుంటే, ఆయన పట్ల ఆంధ్రా ప్రజలలో వ్యతిరేకత మరింత పెరగకుండా ఉంటుందా?
కనుక కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు వేసుకోవడమేదో గొప్ప వ్యూహం అనుకుంటే, వచ్చే ఎన్నికలలో ఇదే వైసీపీ కొంప ముంచవచ్చు.





