ప్రగతి రధ చక్రాలు పంక్చర్ .. కొనకళ్ళ ఏమైనా చేస్తారా?

Konakalla Narayana APSRTC

టిడిపి కూటమి ప్రభుత్వంలో కొంతమంది రాజకీయ నిరుద్యోగులకు పదవుల పంపకాలు పూర్తయ్యాయి. కానీ వారు ఆ పదవులను అనుభవించడం కాక వాటికి ఏ మేరకు న్యాయం చేయగలరనేది చాలా ముఖ్యం. లేకుంటే జగన్‌ ప్రభుత్వంలో కౌరవ సలహాదారుల సంఘంలా అనామకంగా మిగిలిపోతారు.

మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణకి కూటమి పొత్తుల కారణంగా మళ్ళీ పోటీ చేసేందుకు సీటు ఇవ్వలేకపోవడంతో దానికి బదులుగా ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్‌ పదవి లభించింది. ఈరోజు ఆయన ఆ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారి గురించి వారి సన్మానాల గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు.

ADVERTISEMENT

ఏపీఎస్ ఆర్టీసీ దయనీయ పరిస్థితి గురించి నాలుగు ముక్కలు చెప్పుకొని దానిని కొనకళ్ళ నారాయణ ఏవిదంగా సరిద్దగలరో చెప్పుకుంటే సబబుగా ఉంటుంది.

గత 5 ఏళ్ళ జగన్‌ పాలనలో మొట్ట మొదట లాట్రీ తగిలింది ఏపీఎస్ ఆర్టీసీకే! దానిని జగన్‌ ప్రభుత్వంలో విలీనం చేశారు… ఆ తర్వాత చేతులు దులుపుకుని మళ్ళీ దానివైపు చూడనే లేదు. కానీ బటన్ నొక్కుడు సభలకు మాత్రం డొక్కు బస్సులను యాధేచ్చగా వాడేసుకున్నారు.

ఆ డొక్కు బస్సులు గుంతలు పడిన రోడ్లపై తిరగలేక తరచూ మరమత్తులు చేయాల్సివస్తున్నా కనీసం ఆ గుంతలు పూడ్చలేదు. ఇక కొత్త బస్సులు కొంటారని ఎలా ఆశించగలం?

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి చేతులు దులుపుకున్నారే కానీ నేటికీ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వోద్యోగులతో సమానంగా జీతభత్యాలు, సౌకర్యాలు, ప్రయోజనాలు కల్పించడం లేదు. అయినా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకే సకాలంలో జీతాలు ఇవ్వకుండా జగన్‌ ప్రభుత్వం ముప్పతిప్పలు పెడుతున్నప్పుడు, మనం నోరు విప్పి మాట్లాడితే ప్రమాదమని ఆర్టీసీ ఉద్యోగులు నోళ్ళు కుట్టేసుకొని సమస్యలు, కష్టాలను పంటి బిగువున భరిస్తూ 5 ఏళ్ళు గడిపేశారు.

కనుక ఆర్టీసీకి కొత్త బస్సులు కొనుగోలు చేసి భారీగా ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. కానీ జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం చేద్దామంటే ఖజానా ఖాళీగా ఉంది. అందువల్లే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పధకం అమలు ఆలస్యం అవుతోంది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీఎస్ ఆర్టీసీ కష్టాలు చాలానే ఉన్నాయి. కనుక రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద రెడ్డి, ఇప్పుడు సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కొనకళ్ళ నారాయణ, అధికారులతో చర్చించి ఈ సమస్యలన్నిటినీ ఒకటొకటిగా పరిష్కరించాల్సి ఉంది. అప్పుడే వారికి వారి పదవులకు గౌరవం లభిస్తుంది. అప్పుడే ప్రజలు కూడా వారిని గుర్తించి గౌరవిస్తారని గ్రహిస్తే మంచిది.

ADVERTISEMENT
Latest Stories