కృష్ణానదిలో నీళ్ళు లేవు… ఈ ఏడు పంటలకు సాగునీరు ఎలా అందివ్వాలోనని ప్రభుత్వం… నీరు ఎలా వస్తుందోనని రైతులు… సమాలోచనలు చేసుకోవడం సరిపోయింది. పైరుకు తోడు ఈ ఏడాది కృష్ణా పుష్కరాలు కూడా వస్తున్నాయి. దీంతో బయటకు వెల్లడించినా, లేకున్నా ‘ఎలా… ఎలా…’ అన్న ఒక ఆందోళన ప్రభుత్వ వర్గాల్లో నెలకొనడం సహజమే. అయితే పుష్కరాల నాటికి కృష్ణమ్మ ఉరకలు వేస్తూ వస్తుందని ప్రజల నమ్మకం. చివరికి అదే జరుగుతోంది.
గడచిన మూడు వారాల వ్యవధిలో కర్ణాటక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు ఆల్మట్టితో పాటు నారాయణపూర్, జూరాల జలాశయాలు పూర్తిగా నిండిపోయి, కళకళలాడుతున్నాయి. ఈ మూడు జలాశయాల్లోకి వస్తున్న నీటిని వస్తున్నట్టు అధికారులు వదులుతుండగా, ఆ నీరంతా శ్రీశైలం రిజర్వాయరుకు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం అల్మట్టికి 15,420 క్యూసెక్కల నీరు వస్తుండగా, దాన్ని యథాతథంగా దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్ కు 15,448 క్యూసెక్కుల నీరు వస్తుండగా, వాటిని కూడా దాదాపుగా యధాస్థాయిలో దిగువకు పంపుతున్నారు.
ఇక తుంగభద్ర జలాశయంలో నీటిమట్టం 1,612.8 అడుగులకు చేరుకుంది. ఈ జలాశయానికి 7,480 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 7,290 క్యూసెక్కుల నీటిని అధికారులు వదులుతున్నారు. సుంకేసుల జలాశయానికి 2,220 క్యూసెక్కల నీరు ప్రవహిస్తుండగా, ఔట్ ఫ్లో 2,012 క్యూసెక్కులుగా ఉంది. జూరాల జలాశయానికి 38 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 24 వేల క్యూసెక్కులను శ్రీశైలం రిజర్వాయర్ కు వదులుతున్నారు.
వివిధ ప్రాజెక్టుల నుంచి వస్తున్న నీటితో శ్రీశైలానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలానికి 40 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, పుష్కర అవసరాల నిమిత్తం 22,248 క్యూసెక్కుల నీటిని సాగర్ డ్యామ్ కు వదులుతున్నట్టు అధికారులు వెల్లడించారు. శుక్రవారం నాడు 808 అడుగుల వరకూ ఉన్న శ్రీశైలం జలాశయ నీటిమట్టం మరో 10 అడుగులకు పైగా పెరిగి 818.5 అడుగులకు చేరింది. కాగా, శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులన్న సంగతి తెలిసిందే.
వీటికి తోడు ప్రస్తుతం కూడా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో, మరో 12 రోజుల్లో ప్రారంభం కానున్న పుష్కరాల సమయానికి అనుకున్న దాని కంటే ఎక్కువగానే కృష్ణా నది నీరు అందుబాటులో ఉంటుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఉరుకులు పరుగులు పెడుతూ బెజవాడ వస్తున్న కృష్ణమ్మను చూస్తూ పులకించిపోవడం ప్రజలు వంతవుతోంది.



