బిఆర్ఎస్ పార్టీ ఓటమితో ఎదుర్కున్న రాజకీయ నష్టం కన్నా పార్టీ అధినేత కేసీఆర్ అజ్ఞాతంలో, కేటీఆర్ కేసులతో ఎదుర్కొంటున్న రాజకీయ నష్టమే ఎక్కవగా కనిపిస్తుంది. తెలంగాణ రాజకీయాలలో పెను సంచలనాలు ఎదురవుతున్నా, కల్వకుంట్ల కుటుంబం చీలిక దిశగా ముందుకెళ్తున్నా కేసీఆర్ మాత్రం మౌనమే తన ఆయుధం అన్నట్టుగా ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నారు.
ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పార్టీ బాధ్యతలను భుజాన మోస్తున్నా ఆయన పై నమోదైన ఫోన్ టాపింగ్ కేసు, ఫార్ములా ఈ- కార్ రేసింగ్ కేసు ఆయనను, ఆయన పార్టీని రాజకీయంగా ఎప్పటికప్పుడు వెనక్కి లాగుతుందనే చెప్పాలి. ఈ కేసులతో, విచారణలతో పార్టీ శ్రేణులలో రాజకీయ నిస్సహాయత ఏర్పడుతుంది.
కేసు విచారణ అంటూ ఏసీబీ కోర్ట్ నుంచి కేటీఆర్ నోటీసులు అందుకోవడం, ఇవన్నీ రేవంత్ సర్కార్ కక్ష్య పూరిత రాజకీయాలలో భాగమే అంటూ కేటీఆర్ రాజకీయ ప్రకటనలు చేయడం తెలంగాణ రాజకీయాలలో ముఖ్యంగా అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య సర్వ సాధరణంగా మారిపోయింది.
ఈ నేపథ్యంలో మరోసారి ఫార్ములా ఈ- కార్ రేసింగ్ కేసు కు సంబంధించిన కీలక పరిణామం చోటు చేసుకుంది. నాంపల్లి ఏసీబి కోర్ట్ మాజీ మంత్రి కేటీఆర్ తో పాటుగా ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కి కేసు విచారణకు రావాలంటూ సమన్లు జారీ చేసింది.
జులై 31 న కేసు విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులో పేర్కొంది ఏసీబీ కోర్ట్. ఈ కేసులో A -1 గా మాజీ మంత్రి కేటీఆర్, A-2 గా ఐఏఎస్ అర్వింద్, A-3 గా BLN రెడ్డి, A-4 గా కన్సల్టెంట్ కిరణ్, A-5 గా FEO పేర్లు నమోదయ్యాయి. 2023 లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసు కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా HMDA అకౌంట్ నుంచి 55 కోట్లను FEO అనే విదేశీ సంస్థ కు చెల్లించారనే ఆరోపణలతో ఈ కేసు నమోదయ్యింది.




