బీఆర్ఎస్‌ పార్టీకి కౌంట్ డౌన్‌… మొదలైందా?

KTR Probe Approval Sparks Telangana Political Changes

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాలలో కొన్ని మార్పులు చేర్పులు లేదా కొన్ని అనూహ్య పరిణామాలు జరగవచ్చని ముందు నుంచి అనుకుంటున్నదే. ఊహించినట్లే తొలి కదలిక మొదలైంది.

ఎఫ్-1 రేసింగ్ కేసులో బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కేసు నమోదు చేసి విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు.

ADVERTISEMENT

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసు, ఎఫ్-1 రేసింగ్ కేసులతో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావుల మెడలకి ఉచ్చు బిగించాలని సర్వం సిద్దం చేసింది. కాళేశ్వరం కేసులో సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ వ్రాసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.

అంతకంటే తీవ్రమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకు వేయనీయకుండా కేంద్రం అడ్డుపడుతూ కేసీఆర్‌ని కాపాడుతోందని సిఎం రేవంత్ రెడ్డి పదేపదే ఆరోపిస్తున్నారు.

ఎఫ్-1 రేసింగ్ కేసులో కేటీఆర్‌పై కేసు నమోదు చేసి విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించడం లేదని, తద్వారా కేంద్ర ప్రభుత్వం వారు ముగ్గురినీ కంటికి రెప్పలా కాపాడుకొస్తోందని సిఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ఆరోపించారు.

సిఎం రేవంత్ రెడ్డి విమర్శించిన వారం పదిరోజులలోనే కేటీఆర్‌ని ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతించడంతో తెలంగాణ రాజకీయాలలో మార్పులు మొదలయ్యే అవకాశం ఉంది.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ఓటమితో బీఆర్ఎస్‌ పార్టీ తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉంది. ఇంత జరిగినా కేసీఆర్‌ ఫామ్‌హౌసులో నుంచి బయటకు రావడం లేదు. పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం లేదు. కనుక ఒకవేళ ఈ కేసులో కేటీఆర్‌ని పోలీసులు అరెస్ట్‌ చేసినట్లయితే, పార్టీ హరీష్ రావు చేతిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది.

ఆయనతో విభేదించే నేతలు అప్పుడు తెలంగాణ జాగృతి వైపు లేదా కాంగ్రెస్‌, బీజేపిలవైపు చూసే అవకాశం ఉంటుంది. కనుక ఎఫ్-1 రేసింగ్ కేసులో ఈ కదలిక తెలంగాణ రాజకీయ సమీకరణాలు మార్చవచ్చు.

అయితే ఎఫ్-1 రేసింగ్ కేసుతోనే కేంద్ర సరిపెడుతుందా లేదా ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కేసులలో కూడా కదలిక తెస్తుందా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories