ఈ మధ్యకాలంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాజకీయాల నుంచి కాస్త విశ్రాంతి తీసుకున్నారా.? అందుకే ఆయన పేరు కానీ ఆయన జాడ కానీ తెలంగాణ రాజకీయాలలో వినిపించడం తగ్గిందా.? మొత్తానికి కేటీఆర్ మౌన ముద్ర వెనుక ఉన్న ఆ రాజకీయం ఏమిటి.? అనే ప్రశ్న ఇప్పుడు బిఆర్ఎస్ లో వినిపిస్తుంది.
తాజాగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా బిఆర్ఎస్ – కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఏర్పడిన ఉద్రిక్తత అంశం మీద కూడా కేటీఆర్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కాంగ్రెస్ శ్రేణులు తమ క్యాంపు ఆఫీస్ మీద దాడి చేసినప్పటికీ కేటీఆర్ మీడియా ముందుకు రాలేదు, రేవంత్ రెడ్డి పై విమర్శలు చెయ్యలేదు.
గజ్వేల్ క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే కేసీఆర్ ఫోటో కి బదులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటం పెట్టి కేసీఆర్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేసారు. అయితే ఈ వివాదం పై అటు గజ్వేల్ ఎమ్మెల్యే గా కేసీఆర్ నుంచి కానీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ తనయుడు కేటీఆర్ నుంచి కూడా కానీ కాంగ్రెస్ కి వ్యతిరేఖంగా ఎటువంటి ప్రతిస్పందన కనిపించలేదు.
ఈ విషయం పై హరీష్ రావు మీడియా ముందుకొచ్చి కాంగ్రెస్ శ్రేణుల అత్యుత్సాహాన్ని ఎండగట్టారు, దీని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ పై ఆరోపణలు చేసారు. తెలంగాణ జాతి పితగా చెప్పుకునే కేసీఆర్ పై ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆయన ఫోటో పై ఈ రకమైన వివాదం జరిగితే కేటీఆర్ నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడం బిఆర్ఎస్ శ్రేణులు ఆర్చర్యానికి గురిచేసింది.
పార్టీ అధినేతగా కేసీఆర్ అజ్ఞాతంలో ఫామ్ హౌస్ కి పరిమితం కావడం, పార్టీ వివర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఇలా మౌన ముద్రలో ఉండడం బిఆర్ఎస్ కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తుంది. ఒకపక్క చెల్లి కవిత కొత్త పార్టీ అంటూ ఆ పార్టీకి కేసీఆర్ పాత పార్టీ పేరు తెరాస అంటూ పరోక్ష ప్రకటనలు చేస్తున్నారు.
మరోపక్క రేవంత్ రెడ్డి తన దూకుడుతో తెలంగాణ రాజకీయాలలో దూసుకుపోతున్నారు. ఇక హరీష్ సైతం బిఆర్ఎస్ పార్టీలో తన పట్టు నిలుపుకునేందుకు సందు చిక్కినప్పుడల్లా ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ ఎల్లప్పుడూ రాజకీయంగా యాక్టీవ్ గా ఉంటున్నారు.
ఇటువంటి సమయంలో ఒక్కసారిగా కేటీఆర్ సైలెన్స్ మోడ్ లోకి వెళ్ళిపోతే అది బిఆర్ఎస్ పార్టీకి రాజకీయ ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ఇప్పటికే కవిత హరీష్ రాజకీయంతో నేను ఎలా అయితే అవమాన భారంతో బిఆర్ఎస్ నుంచి బయటకొచ్చానో భవిష్యత్ లో కేసీఆర్, కేటీఆర్ కూడా అదే విధంగా వచ్చే ప్రమాదం ఉందంటూ వాపోయారు.
ఈ నేపథ్యంలో పార్టీ అధినేతగా కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమైనప్పటికీ కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ మాత్రం నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ పార్టీ ని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు, అలాగే పార్టీలో తన పట్టు సడలిపోకుండా ఉండేందుకు ఏదొక కార్యక్రమంతో కనిపిస్తూ ఉండాలి లేదా వినిపిస్తూ ఉండాలి.




