ఏపీలో పాలన, అభివృద్ధి అంటే సంక్షేమ పధకాలే అన్నట్లుగా మారిపోయింది. జాబ్ క్యాలండర్ విడుదల చేయమని నిరుద్యోగులు అడుగుతుంటే సంక్షేమ క్యాలండర్ విడుదల చేసింది వైసీపీ ప్రభుత్వం. నెలనెలా జీతాల కోసం ఉపాధ్యాయులు రోడ్లపై ఆందోళనలు చేస్తుంటే, 1వ తేదీ ఉదయం 5 గంటలకే వాలంటీర్లు పింఛన్లు అందిస్తున్నారని వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకొంటారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంతకంటే చాలా భారీ సంక్షేమ పధకాలనే అమలుచేస్తోంది. వాటితో అధికార బిఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాలను పొందే ప్రయత్నం చేస్తూనే, ప్రజలకు, రాష్ట్రానికి కూడా వాటి వలన మేలు కలిగేలా రూపొందించుకొంది. ఇందుకు అత్యుత్తమ ఉదాహరణ బతుకమ్మ చీరల పధకం.
తెలంగాణలో బతుకమ్మ పండుగ అత్యంత ప్రధాన పండుగలలో ఒకటి. ఆ పండుగకి ముందు రాష్ట్రంలో సుమారు 50-60 లక్షల మంది నిరుపేద మహిళలకు ఒక్కొక్కరికీ రెండు నాణ్యమైన చీరలు చొప్పున అందిస్తోంది. వాటిని నేసే బాధ్యత తెలంగాణలో చేనేత కార్మికులకు అప్పగించింది.
ఒకప్పుడు తెలంగాణలో చేనేత కార్మికులు ఉపాది లేక, అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకొనేవారు. కానీ ఈ పధకం ప్రారంభం అయినప్పటి నుంచి తెలంగాణలో సుమారు 15 వేలమందికి పైగా చేనేత కార్మికులందరికీ చేతినిండా పని, నెలకు 15-18 వేల రూపాయల ఆదాయం లభిస్తోంది. ఇది చూసి బీడీ కార్మికులు, కూలిపనులు చేసుకొనేవారు కూడా చేనేత పని నేర్చుకొని ఉపాది పొందుతున్నారు. ఈ చీరల తయారీ ప్రక్రియలో అనేక దశలు ఉంటాయి. వాటి ద్వారా కూడా అనేకమందికి ఉపాధి లభిస్తోంది.
ఈ ఏడాది బతుకమ్మ చీరల కోసం రూ.350 కోట్లు ఖర్చు చేసింది. చేనేత కార్మికులు ఇప్పటివరకు 90 లక్షల చీరలు తయారు చేశారు. మరో 10 లక్షల చీరలు తయారుచేస్తున్నారు. నిరుడు బతుకమ్మ చీరలు నేసి అందించిన వెంటనే మళ్ళీ కొత్త చీరలు నేసే పని మొదలుపెట్టినా, నేటికీ మరో 10 లక్షల చీరలు నేస్తూన్నారంటే వారికి ఏ స్థాయిలో ఉపాది లభిస్తోందో అర్దమవుతోంది.
ఇటు చేనేత కార్మికులు, ఇటు రాష్ట్రంలో నిరుపేద మహిళలలు కూడా కేసీఆర్, కేటీఆర్లని మనసారా దీవిస్తున్నారు. సంక్షేమ పధకమంటే ఇది. ఇలా ఉండాలి. అంతే కానీ వాటితో రాష్ట్రం మునిగిపోకూడదు.



