రాజకీయాలలో ‘రక్షా కవచం’ అంటే అవినీతి కేసులలో చిక్కుకున్నవారు అధికారంలో ఉన్న పార్టీలో చేరి కేసుల నుంచి ఉపశమనం పొందడమే.. అని సామాన్య ప్రజలకు కూడా బాగా తెలుసు.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై ప్రభుత్వ భూములు కబ్జా ఆరోపణలు, అయన కుటుంబం నిర్వహిస్తున్న కాలేజీల ఆదాయ పన్ను కేసులు ఉన్నాయి.
కనుక భూముల విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతో, ఆదాయపన్ను కేసుల కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుకొని రక్షణ కవచాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజీలపై జేసీబీలు వచ్చి పడిన తర్వాత మల్లారెడ్డి వెళ్ళి సిఎం రేవంత్ రెడ్డితో మాట్లాడారు. ఆ తర్వాత హైడ్రా అటువైపు వెళ్ళలేదు. ఎందుకంటే విద్యార్ధుల భవిష్యత్ కూడా చూడాలి కదా? అని సర్ది చెప్పారు.
ఆదాయపన్ను కేసులున్నాయి కనుక మల్లారెడ్డి ఇటీవల కుటుంబసమేతంగా ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని, బిజేపి పెద్దలను కలిసి ఫోటోలు దిగి వచ్చారు. హైదరాబాద్ తిరిగి రాగానే ఆయన కోడలు పిల్ల ప్రీతి రెడ్డి బిజేపి కార్యాలయానికి వెళ్ళి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రెడ్డితో భేటీ అయ్యారు.
కనుక ప్రస్తుతానికి ఆమె ఒక్కరే కవచం తీసుకుంటున్నారని ఊహాగానాలు మొదలైపోయాయి. కానీ తాము కవచాల కోసం ఢిల్లీ వెళ్ళలేదని, తమ కాలేజీలో ఏదో కార్యక్రమానికి ఆహ్వానించేందుకే వెళ్ళామని కోడలు పిల్ల క్లారిటీ ఇచ్చింది. కానీ పార్టీ మారే వరకు అందరూ అలాగే చెప్తుంటారు. కనుక మారనంత వరకు నమ్మాల్సిందే!
అలాగని కేసులు ఆగిపోవు. ఉపేక్షిస్తే ప్రమాదమే. కానీ కవచాలు తొడుక్కోవడానికి ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నారు? అంటే తొడుక్కుంటే బీఆర్ఎస్ పార్టీతో కోర్టు కేసుల తలనొప్పులు మొదలైపోతాయి.
కనుక అటు డిల్లీ వాళ్ళకి, ఇటు హైదరాబాద్ వాళ్ళకీ ఏదో సర్ది చెప్పుకొని ఎన్నికల వరకు పాటలు, డాన్సులు చేసుకుంటూ ఎమ్మెల్యేగా కాలక్షేపం చేయాలని నిర్ణయించుకున్నారేమో?




