స్థిరమైన ప్రభుత్వం, నిఖార్సైన విధానాలు ఉంటే ఏ రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధిపధంలో దూసుకుపోతుంది. అందుకు భిన్నంగా ఉంటే ఆ రాష్ట్రం పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో చెప్పడానికి జగన్ 5 ఏళ్ళ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి చెప్పుకోవచ్చు.
లక్షలకోట్లు విలువైన రాజధాని అమరావతినే నిర్ధాక్షిణ్యంగా పాడుబెట్టేసిన జగన్ ప్రభుత్వం, పరిశ్రమల విషయంలో కూడా అదేవిదంగా వ్యవహరించింది.
చంద్రబాబు నాయుడుపై జగన్కు వ్యక్తిగతంగా, రాజకీయంగా కక్ష ఉంటే దానిని ఆయనతోనే తేల్చుకోవాలి. కానీ ఆయన మీద కక్షతో రాష్ట్రానికి తీరని నష్టం కలిగించారు.
ఇందుకు మరో నిదర్శనంగా కృష్ణా జిల్లాలోని మల్లవల్లిలో 1,340 ఎకరాలలో టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మోడల్ ఇండస్ట్రియల్ పార్కు గురించి చెప్పుకోవచ్చు.
రాష్ట్ర విభజన వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దగా పరిశ్రమలు లేకపోవడం వలన వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిపోయింది. కనుక అప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకి చాలా ప్రాధాన్యం ఇస్తూ అనేక పారిశ్రామికవాడలు ఏర్పాటు చేయించి, చిన్న, మద్య, భారీ పరిశ్రమలను రప్పించేందుకు గట్టిగా కృషి చేశారు.
ఆవిదంగా ఏర్పాటు చేసిందే మల్లవల్లి బహుళ ఉత్పత్తుల పారిశ్రామికవాడ. దానిలో 349 మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు ఏర్పాటుచేసేందుకు ముందుకు రాగా వారిలో ఒక్కొక్కరికీ ఎకరా రూ.16.50 లక్షల చొప్పున 10, 25, 50, 100, 150 ఎకరాల చొప్పున పరిశ్రమల స్థాయిని బట్టి భూములు కేటాయించారు.
వాటిలో అశోక్ లేలాండ్, పార్లే వంటి జాతీయస్థాయిలో పేరు మోసిన భారీ పరిశ్రమలు కూడా ఏర్పాటు కావలసి ఉంది. కానీ 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారికి కష్టాలు మొదలయ్యాయి. వారందరూ టిడిపి మద్దతుదారులనే ముద్రవేసి వేధించింది. వారికి కేటాయించిన భూములను రద్దు చేసింది.
దాంతో వారు హైకోర్టుని ఆశ్రయించగా వారికి మల్లవల్లి పారిశ్రామికవాడలో భూములు కేటాయించాలని తీర్పు చెప్పింది. అప్పుడూ జగన్ ప్రభుత్వం అతితెలివి ప్రదర్శిస్తూ ఆ భూముల ధరలు పెంచేసి ఎకరానికి రూ.65 లక్షలు చొప్పున చెల్లించి తీసుకోవచ్చని చెప్పడంతో అంతా సొమ్ము చెల్లించలేక పారిశ్రామికవేత్తలు వాటిని వదిలేసుకున్నారు.
ఆ పారిశ్రామికవాడకి జగన్ ప్రభుత్వం అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో దానిలో ఏర్పాటు అయిన కొన్ని పరిశ్రమలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అదే… జగన్ ప్రభుత్వం అక్కడ పరిశ్రమల స్థాపనకి సహకరించి ఉండి ఉంటే ఈపాటికి అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యి ఉండేవి. వాటిలో అనేక వేలమందికి ఉద్యోగాలు, ఉపాధి లభించేది. ఆ పరిశ్రమల వలన చుట్టూ పక్కల ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెంది ఉండేవి. వాటి వలన రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం లభించేది. కానీ జగన్ రాజకీయ కక్షలకి ఈ అభివృద్ధి అంతా బలైపోయింది.
ఇప్పుడు ఏపీలో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఈ సమస్యని పరిష్కరించారు.
మల్లవల్లి పారిశ్రామికవాడలో ఇదివరకు దరఖాస్తు చేసుకున్న పారిశ్రామికవేత్తలకు అప్పటి ధర ప్రకారమే అంటే ఎకరా రూ.16.50 లక్షల చొప్పున భూములు కేటాయించాలని నిర్ణయించారు. ముందుగా ఆ పారిశ్రామికవాడలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడ ముందుగా పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి, ఎక్కువ మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించే పరిశ్రమలకు మరిన్ని ప్రోత్సాహకాలు కూడా ప్రకటించారు. కనుక త్వరలో మల్లవల్లి పారిశ్రామికవాడ పరిశ్రమలతో కళకళలాడటం ఖాయమే.




