గుంటూరు జిల్లాలోని నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి కూతవేటు దూరంలోని మంగళగిరి రవాణా శాఖ కార్యాలయం(ఆర్టీఏ)లో అవాక్కయ్యే వింత చోటు చేసుకుంది. సదరు కార్యాలయంలో ఎంవీఏగా పనిచేస్తున్న నాగేశ్వరరావు అనే ఉద్యోగి ఒకే చిరునామా పేరిట ఏకంగా 27 వాహనాలను రిజిస్టర్ చేసి నెంబర్లు కూడా ఇచ్చేశారు. ఏదో కార్పొరేట్ కంపెనీ కొనుగోలు చేసిన వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేశారనుకుంటే మనం తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే సదరు ఉద్యోగి కేటాయించి రిజిస్టర్ చేసిన వాహనాలన్నీ అసలు ఉనికిలోనే లేవు. వాహనాలు ఉన్నట్లుగా నకిలీ దస్తావేజులు సృష్టించిన నాగేశ్వరరావు, ఈ రిజిస్ట్రేషన్లు చేశారు.
అయినా లేని వాహనాలకు రిజిస్ట్రేషన్లు చేస్తే నాగేశ్వరరావుకు ఏమోస్తుందనేగా మీ డౌటు. ఇక్కడ డౌటు పడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఎందుకంటే, దేశీయ చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) వద్ద కాంట్రాక్టు దక్కించుకునేందుకు రంగంలోకి దిగిన బడా కాంట్రాక్టర్లకు కొమ్ము కాసేందుకు సిద్ధపడ్డ ఆయన భారీ ఎత్తున ముడుపులు అందుకుని ‘మాయ దందా’కు తెర లేపినట్లు రవాణా శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. దీనిపై విచారణ కూడా మొదలైంది. ఈ విచారణలో ఇంకా ఏమేం మాయలు వెలుగుచూస్తాయో చూడాలి.
ఈ సంఘటనపై ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ఫైరయ్యారు. ఉనికిలోనే లేని 27 వాహనాలకు ఎంవీఐ నాగేశ్వరరావు రిజిస్ట్రేషన్ చేసిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనువెంటనే రవాణా శాఖ ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోనే తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ తరహా మోసాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా నాగేశ్వరరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.



