వైసీపి అధికారంలో ఉన్నప్పుడు సకాలశాఖా మంత్రిగా సజ్జల రామకృష్ణా రెడ్డి ఓ వెలుగు వెలిగారు. ఒక్కోసారి ఆయనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి నడుపుతున్నారా?అనే అనుమానం కలిగేది.
ప్రభుత్వం, పార్టీ వ్యవహారాలు మాత్రమే కాదు… పోలీస్ వ్యవస్థని చెప్పుచేతలలో ఉంచుకొని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని, టిడిపి నేతలని కూడా ఆయనే హ్యాండిల్ చేసేవారు.
కనుక జగన్ ప్రభుత్వంలో జరిగిన ప్రతీ పనికి, ఆరాచానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సజ్జల వారి ప్రమేయం తప్పక ఉండేదని ఆ పార్టీని వీడి బయటకు వచ్చినవారే చెపుతుంటారు.
ఇటీవల ఆయన విదేశం నుంచి ముంబయి విమానాశ్రయంలో దిగి హైదరాబాద్ బయలుదేరుతున్నప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను అడ్డుకున్నారు. ఆయనపై గుంటూరు పోలీసులు లుకవుట్ నోటీస్ జారీ చేశారని చెప్పడంతో ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నాపై ఎటువంటి కేసులు లేవు. నన్ను ఎందుకు అడ్డుకొంటున్నారంటూ,’ వారిపై విరుచుకుపడ్డారు.
అయినా నేను విదేశాలకు పారిపోవడం లేదని విదేశం నుంచి తిరిగివచ్చి హైదరాబాద్ వెళుతుంటే అడ్డుకోవడం ఏమిటని సజ్జల వారిని ప్రశ్నించారు. ఈలోగా గుంటూరు ఎస్పీ వారికి ఫోన్ చేసి ఆయనని విడిచిపెట్టాలని కోరారు.
ముంబయి విమానాశ్రయంలో తనపై ఎటువంటి కేసులు లేవని సజ్జల వాదించారు. కానీ ఆయన విజయవాడ చేరుకోగానే మంగళగిరి పోలీసులు ఆయనకు నోటీస్ అందించి ఆయన ముచ్చట తీర్చేశారు.
టిడిపి కార్యాలయంపై దాడి కేసులో ఈ గురువారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావలసిందిగా నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసుతో దేవినేని అవినాష్, లేళ్ళ అప్పిరెడ్డి, తలశిల రఘురాం తదితరులను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించి వారు చెప్పిన వివరాలు ఆధారంగా సజ్జలని ప్రశ్నించేందుకు రప్పిస్తున్నారు.
వైసీపి హయాంలో సజ్జల రామకృష్ణా రెడ్డికి తెలియకుండా, ఆయన అనుమతి, ఆదేశం లేకుండా ఏ పని జరిగేది కాదు. కనుక టిడిపి కార్యాలయంపై దాడి కూడా ఆయన సూచన మేరకే జరిగి ఉండవచ్చు. ఈ విషయం అందరి కంటే బాగా పోలీసులకే బాగా తెలిసి ఉంటుంది. అందుకే నోటీస్ జారీ చేశారు. కనుక తనపై ఎటువంటి కేసులు లేవని సజ్జల రామకృష్ణా రెడ్డి సంతోషపడనవసరం లేదు.




