నిన్న ఖమ్మంలో చంద్రబాబు నాయుడు నిర్వహించిన బహిరంగసభ విజయవంతం అవడంతో అక్కడి అధికార బిఆర్ఎస్ పార్టీ ఉలిక్కి పడింది. తెలంగాణ టిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తర్వాత నిజామాబాద్లో బహిరంగసభ ఏర్పాటు చేస్తానని చెప్పగానే నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఆ తర్వాత మంత్రులు హడావుడిగా ప్రెస్మీట్ పెట్టి చంద్రబాబు నాయుడిపై విరుచుకు పడుతున్నారు.
తాజాగా కరీంనగర్ నుంచి మంత్రి గంగుల కమలాకర్ చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఈ 8 ఏళ్లలో తెలంగాణ అన్ని విదాల అభివృద్ధి చెంది గొప్ప సంపద సృష్టించుకొంది కనుక వైఎస్ షర్మిల, కెఏ పాల్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అందరి కళ్ళు రాష్ట్రంపై పడ్డాయని, అందరూ ఆ సంపదని దోచుకుపోయేందుకు వస్తున్నారని ఆరోపించారు. వీరందరూ వేర్వేరు వేషాలలో వస్తున్న మాయగాళ్ళని, మళ్ళీ తెలంగాణని ఏపీలో కలపాలని కుట్రలు చేసేందుకే వస్తున్నారని కనుక ప్రజలు వారిపై తిరగబడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ సంపదను, నీళ్ళని ఎత్తుకుపోయేందుకు వస్తున్న దొంగలని అన్నారు. వీరందరినీ బిజెపియే తెలంగాణ మీదకి పంపిస్తోందని అందరూ కలిసి పెద్ద కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తాము బిఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాలలోకి వెళుతున్న సమయం చూసి వీరందరూ రాష్ట్రంలో ప్రవేశించి తెలంగాణ సంపదని దోచుకుపోవాలని వస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు.
మేము ఏనాడూ ఏపీని దోచుకోలేదు కనుక ధైర్యంగా ఏపీలో పోటీ చేయాలనుకొంటున్నాము. కానీ మీరందరూ గతంలో తెలంగాణని దోచుకొన్నారు కనుక వీరిని వ్యతిరేకిస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
ఏపీని దోచుకోలేదు కనుక ఏపీలో పోటీ చేయడానికి తమకి అర్హత ఉందని వాదిస్తున్న గంగుల కమలాకర్కి, అసలు ఏపీని అభివృద్ధి చెందకుండా అడ్డుకొన్నది తమ అధినేత కేసీఆరేనని తెలియదా?చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తే, హైదరాబాద్కి తీరని నష్టం కలుగుతుందని ఆయన మళ్ళీ అధికారంలోకి రాకుండా, మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రాభివృద్ధికి బ్రేకులు వేయించింది కేసీఆర్ కాదా?ఆ కారణంగా రాష్ట్రానికి రావలసిన పరిశ్రమలు, ఐటి కంపెనీలు అన్నీ హైదరాబాద్ తరలిపోవడం నిజం కాదా?నేడు ఏపీ ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉందంటే దానికి కారణం తామే అని గంగుల కమలాకర్కి తెలుసు. ఏపీలో అసలు అభివృద్ధే జరగనప్పుడు ఇంకా దోచుకుపోవడానికి ఏముంటుంది ఇక్కడ?
ఓ పక్క ఏపీని కోలుకోలేని విదంగా దెబ్బతీస్తూనే మళ్ళీ ఏపీలో పోటీ చేస్తామని చెప్పడం, అదే సమయంలో ఏపీకి చెందిన నేతలెవరూ తెలంగాణలో అడుగుపెట్టడానికి వీల్లేదని మాట్లాడటం తెంపరితనమే. ఏపీ నాయకులందరూ తెలంగాణని దోచుకోవడానికి వస్తున దొంగలని మంత్రి స్థాయిలో ఉన్న గంగుల కమలాకర్ అన్నారు. ఏపీని, ఏపీ నాయకుల పట్ల ఇంత హీనంగా మాట్లాడే బిఆర్ఎస్ని ఏపీ ప్రజలు నెత్తిన పెట్టుకొని మోయడానికి సిద్దంగా ఉండాలా?ఎందుకు? కేసీఆర్ని ప్రధానమంత్రి చేయడానికా?



