కక్ష సాధింపులకు కవరింగ్… ఇంకెంతకాలం.. ఇంకెంతకాలం?

Minister Roja Comments on Houses Demolition in Ippatam Villageటిడిపి నేతలు అన్నా క్యాంటీన్‌ పెడితే వాటిపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేసి విధ్వంసం సృష్టింస్తారు. కానీ పోలీసులు వచ్చి టిడిపి నేతలని, కార్యకర్తలని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు! అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే వారిపై దాడులు చేసి, వారే శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నారని కోర్టులో ఎదురు పిర్యాదు చేస్తుంటారు! వారి పాదయాత్రని అడ్డుకోవడానికి హటాత్తుగా రాజమండ్రి రైల్-కమ్-రోడ్ వంతెనను మరమత్తుల కోసం మూసేస్తారు. ఏమంటే అభివృద్ధి పనులు అని సమర్ధించుకొంటారు!

జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ని నానా మాటలు అని కార్యకర్తలని రెచ్చగొట్టి వారు తమపై దాడి చేశారని కేసులు పెట్టి లోపల వేస్తారు. వారు బెయిల్‌పై విడుదలై బయటకు వస్తే పలకరించడానికి వెళ్ళినవారిని అరెస్ట్ చేసి కేసు పెడతారు. ఏమంటే పోలీసుల అనుమతి లేదంటారు!

ADVERTISEMENT

పవన్‌ కళ్యాణ్‌ విశాఖను వస్తే ఆయన వలన శాంతిభద్రతల సమస్య ఉంటుందని రెండు రోజులు హోటల్‌లో గదిలో నుంచి బయటకు కదలకుండా నిర్బందించి తిప్పి పంపుతారు. ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఇప్పటం గ్రామంలో ప్రజలను కలవడానికి వెళితే విద్యుత్‌ సరఫరా నిలిపేసి గ్రామాన్ని అంధకారంగా మార్చేస్తారు.

హైదరాబాద్‌లో అయ్యన్న పాత్రుడి కుమారుడు విజయ్ ఇంట్లో లేనప్పుడు ఆయన ఇంట్లోకి పోలీసులు జొరబడి భయబ్రాంతులు సృష్టిస్తారు. నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడి ఇంట్లో అర్దరాత్రి జొరబడి అరెస్ట్ చేసి పైశాచికానందం అనుభవిస్తారు!

జనసేన సభకు స్థలం ఇచ్చినందుకు ఇప్పటం గ్రామంలో ఇళ్ళు కూల్చివేస్తారు. చివరికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షోలో లైట్లు ఆర్పేసి రాళ్ళు విసిరి దాడి చేస్తారు. మూడున్నరేళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఎప్పుడు, ఎక్కడ చూసినా ఇవే కక్షసాధింపులు, వేధింపులు, అరాచక పరిస్థితులు.

ఈరోజు పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటం గ్రామంలో పర్యటించి కూల్చేసిన ఇళ్లను పరిశీలించి, బాధితులను పరామర్శిస్తే, ఓ మంత్రి అసలు ఇప్పటంలో ఒక్క ఇల్లు కూడా కూల్చలేదని వాదిస్తారు. మంత్రి రోజా మరో అడుగు ముందుకు వేసి, “మేము రోడ్లు వేయకపోతే వేయలేదని ఏడుస్తారు. వేస్తే ఇళ్ళు కూల్చేశామని చెపుతూ గొడవలు సృష్టించడానికి పరిగెత్తుకు వచ్చేస్తారు. ఇప్పటంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టినవారందరికీ ఏప్రిల్ నెలలోనే నోటీస్ ఇచ్చి రెండు మూడు సార్లు చెప్పిన తర్వాతే వారు ఆక్రమించుకొన్న మేరకే కూల్చాము.

ఇప్పటం గ్రామంలో కొందరు తమ గ్రామం అభివృద్ధి చెందుతోందని సంతోషిస్తూ స్వచ్ఛందంగా ప్రహారీ గోడలు తొలగించుకొన్నారు. ఇప్పటంలో ఎవరూ బాధపడటం లేదు. కానీ చంద్రబాబు నాయుడు ఉసిగోల్పగానే పవన్‌ కళ్యాణ్‌ పరిగెత్తుకు వచ్చేసి ఇప్పటంలో డ్రామా ఆడారు. అసలు టిడిపి హయాంలో వేసిన రోడ్లెన్ని?ఈ మూడున్నరేళ్ళలో మా ప్రభుత్వం వేసిన రోడ్లెన్ని?దమ్ముంటే చర్చించడానికి టిడిపి, జనసేన పార్టీలలో ఎవరైనా రాగలరా? మేము అభివృద్ధి చేస్తున్నా ఏడుస్తామంటే ఎవరేమీ చేయగలరు?” అని మంత్రి రోజా అన్నారు.

రాష్ట్రంలో ప్రధాన రహదారులు గోతులు పూడ్చలేని ప్రభుత్వం, మారుమూల ఇప్పటం గ్రామంలో రోడ్లు వెడల్పు చేయాలనుకోవడం విడ్డూరమే కదా? పైగా పేద ప్రజల ఇళ్ళు కూల్చేసి వాళ్ళు ఏడుస్తుంటే చాలా సంతోషిస్తున్నారని, ఇప్పటంలో అభివృద్ధి పనులను అడ్డుకోవడానికి టిడిపి, జనసేనలు కుట్రలు పన్నుతున్నాయంటూ మంత్రి రోజా సమర్ధించుకోవడం చూస్తే ఈ కక్ష సాధింపులు… వాటికి ఇలాంటి కవరింగ్… ఇంకెంతకాలం.. ఇంకెంతకాలం?అనిపించక మానదు. తమ ప్రభుత్వ తీరుని చూసి ప్రజలు ఏమనుకొంటున్నారో అనే ఆలోచన, భయం కూడా లేకుండా ఇంత వ్యవహరించడం వారికే చెల్లు!

ADVERTISEMENT
Latest Stories