వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి 72 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి బెయిల్పై నిన్న బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
నేడు ఆయన మీడియా సమావేశం నిర్వహించి, కూటమి ప్రభుత్వం తనని రాజమండ్రి సెంట్రల్ జైల్లో చాలా ఇబ్బంది పెట్టిందని చెప్పారు.
ఓ కరడుగట్టిన ఉగ్రవాదిని ట్రీట్ చేసినట్లు తనను ట్రీట్ చేశారని చెప్పారు. తన సెల్ వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేశారని దాని ద్వారా తనని ఎవరెవరు చూస్తున్నారో ఊహించగలనన్నారు.
జైలు అధికారులపై చాలా ఒత్తిడి ఉన్నందున ఎవరూ తనతో మాట్లాడేందుకు కూడా భయపడేవారన్నారు. కోర్టు ఆదేశించే వరకు జైలు అధికారులు తనకు సాధారణ ఖైదీలకు కల్పించిన సౌకర్యాలు కూడా ఇవ్వలేదని మిథున్ రెడ్డి ఆరోపించారు.
ఇదివరకు జగన్ ప్రభుత్వం తమ సొంత ఎంపీ రఘురామ కృష్ణరాజుకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చిందో అందరికీ తెలుసు. ఆ భయంతో ఆయన ఢిల్లీకి పారిపోయి ఎన్నికల వరకు అక్కడే గడిపారు.
అదేవిదంగా టీడీపి సీనియర్ నేతలైన పట్టాభిరామ్, అయ్యన్న పాత్రుడు, అచ్చన్నాయుడులతో జగన్ ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరించిందో అందరికీ తెలుసు.
మాజీ ముఖ్యమంత్రి, అనుభవంలో, వయసులో జగన్ కంటే చాలా పెద్దవారైన చంద్రబాబు నాయుడుని రాజమండ్రి సెంట్రల్ జైలులో నిర్బందించి ఎంతగా వేధించిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.
తమ హయంలో టీడీపి నేతలని అంతగా వేధించడమే కాదు… తాము మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ కక్ష సాధింపులు మరింత తీవ్రంగా కొనసాగిస్తామని వారి అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెపుతున్నారు. ఈ అరాచక విధానాలు కొనసాగించేందుకు స్వయంగా ‘డిజిటల్ బుక్’ ప్రవేశపెట్టారు కదా?
కనుక గతంలో చేసిన తప్పులే భవిష్యత్తులో కూడా చేస్తామని, అధికారంలోకి వస్తే టీడీపి నేతల తాట తీస్తామని హెచ్చరిస్తున్నప్పుడు, కూటమి ప్రభుత్వం తమకి జైల్లో రాచమర్యాదలు చేయాలని వైసీపీ నేతలు ఎలా ఆశించగలరు?






