మన దేశంలో రాజకీయ నాయకుల ప్రసంగాలలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, నైతిక విలువలు వంటి పదాలు అప్రయత్నంగానే దొర్లిపోతుంటాయి. కానీ ఇదే రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలోకి మారగానే మరోలా మాట్లాడుతుంటారు.
ఇందుకు తాజా నిదర్శనంగా తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఆ రెండు పార్టీల భిన్నమైన వ్యవహార శైలి గురించి చెప్పుకోవచ్చు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థించింది. కానీ ఆయన 10 మందిలో ఐదుగురు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ వేసిన పిటిషన్లను కొట్టివేశారు! వారిపై అనర్హత వేటు వేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు.
ఇది రాజ్యాంగాన్ని దిక్కరించడమే… ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించడం మొదలుపెట్టింది.
అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తమ పార్టీలలోకి ఫిరాయింపజేసుకోవడం తప్పుగా అనుకోలేదు.
కానీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది తప్పని వాదిస్తున్నాయి. ఈ ఫిరాయింపులు రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తున్నాయి. ఫిరాయింపుల విషయంలో రెండు పార్టీలు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడాయి.
రాజకీయ పార్టీ ప్రతిపక్షంలోకి మారగానే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పట్ల దాని ఆలోచనా తీరు సమూలంగా మారిపోతుందని ముందే చెప్పుకున్నాము. అందువల్లే స్పీకర్ నిర్ణయం బీఆర్ఎస్ పార్టీకి తప్పుగా కనిపిస్తోంది.
ఇంకా గమ్మతైన విషయం ఏమిటంటే, ఎమ్మెల్యేలు, స్పీకర్తో సహా ప్రజా ప్రతినిధులు అందరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని, ఆశ్రిత పక్షపాతానికి తలొగ్గమని ప్రమాణాలు చేస్తారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రాజ్యాంగం, చట్టాలలోని లొసుగులను అనుకూలంగా మలుచుకొని తమని తాము, ఫిరాయింపు ఎమ్మెల్యేలని ఈ విధంగా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు!
కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఆశ్రయిస్తుంటారు. అవే తమ పార్టీని, హక్కులను అధికార పార్టీ బారి నుంచి కాపాడాలని కోరుకుంటారు.
మన రాజకీయ నాయకుల ద్వంద్వ వైఖరికి ఇంతకంటే గొప్ప నిదర్శనాలు ఏముంటాయి? అందరూ రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, నైతిక విలువల గురించి మాట్లాడుతుంటారు. కానీ ఎవరికీ వాటి పట్ల నమ్మకం, గౌరవం లేవని స్పష్టం అవుతోంది కదా?






