తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే గా గెలిచిన కొలికపూడి వ్యవహారం రోజురోజుకి టీడీపీ పార్టీకి గుదిబండగా మారుతుంది. ఇప్పటికే మహిళల పట్ల అసభ్యకర పోస్టులు పెట్టాడంటూ ఒకపక్క ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దానికి తోడు మరోపక్క సదరు ఎమ్మెల్యే తమ పై లైంగిక వేధింపులకు సైతం పాల్పడుతున్నాడు అంటూ సొంత పార్టీ మహిళలు రోడ్ ఎక్కి తక్షణమే కొలికపూడిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ నిరసన దీక్షలు చేపట్టారు.
అలాగే కొలికపూడి కూడా తన పై వస్తున్నా ఆరోపణలు పై టీడీపీ పార్టీ తక్షణమే విచారణ జరిపి తానూ దోషి అని తేలితే శిక్ష ఖరారు చేయాలనీ, లేకపోతె తన పై ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల పట్ల చట్ట పరమైన చర్యలు తీసుకోవాలంటూ తానూ కూడా తిరువూరు టీడీపీ పార్టీ కార్యాలయం ఎదుట నిరసన దీక్షకు దిగారు.
అయితే పార్టీ ఆదేశాలతో తన నిరసన దీక్షను విరమించిన కొలికపూడి తాజాగా రైతులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారంగా మారాయి. దీనితో సదరు ఎమ్మెల్యే తీరు పట్ల సర్వత్రా వ్యతిరేక గళం వినపడుతుంది.
అసలు విషయానికి వస్తే., ఎన్నికల ఫలితాలకు ముందే తానూ లక్షలు ఖర్చు పెట్టి పంట కాలువలలో పూడిక తీయించాను. ఇదంతా ఎవరి కోసం చేశాను, రైతులకోసమే కదా.? తానూ రైతుల కోసం ఇంత చేస్తే ఇప్పుడు తన పై తప్పుడు ఆరోపణలు వస్తున్న సందర్భంలో తనకు మద్దతుగా ఏ ఒక్క రైతన్నా ఇక్కడికి వచ్చాడా.? అంటూ తన ఆక్రోశాన్ని వెళ్లబుచ్చారు.
కనీసం ఇక్కడితో అయినా కొలికపాటి తన విమర్శలకు ఫుల్ స్టాప్ పెడితే బాగుండేది. కానీ ఆయన గారు తన నోటి దూలను మరోసారి బయటపెట్టుకున్నారు. కుక్కలకు మనం ఏదైనా చేస్తే అవి తిరిగి మన పై విశ్వాసం చూపిస్తాయి. కానీ కొందరు ఆ విశ్వాసం కూడా చూపించారు అంటూ వ్యాఖ్యానించారు.
దీనితో ఈ వ్యాఖ్యలు పరోక్షంగా రైతులను ఉద్దేశించి చేసినవే అంటూ కొలికపూడి పై సొంత పార్టీ క్యాడరే మండిపడుతున్నారు. అయితే ఈయన గారి నోటి దూల టీడీపీ పార్టీకి శాపంగా మారకముందే కొలికపూడిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలంటూ టీడీపీ శ్రేణులే పార్టీ అధిష్టానానికి వినతులు సమర్పిస్తున్నారు.
మొదటి సారిగా ఒక ప్రజాప్రతినిధిగా గెలిచిన కొలికపూడి శ్రీనివాస్ ఈ విధంగా నిత్యం ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఏదొక వివాదంలో ఇరుక్కుంటూ తనను నమ్మి ఓటేసిన తిరువూరు ప్రజలకు కానీ, తనను నమ్మి పార్టీ టికెట్ ఇచ్చిన టీడీపీ అధిష్టానానికి కానీ చేసిందేమిటో ఒక్కసారి ఆలోచించుకోవాలి.
ఇది వైసీపీ జమానా కాదు, ఇక్కడ మహిళల పట్ల తప్పుగా ప్రవర్తించినా, ప్రజలు పట్ల నిర్లక్ష్యం వహించినా, సామాన్యుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తప్పవు అంటూ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఎన్నో సందర్భాల్లో బహిరంగంగానే తన పార్టీ నేతలకు హెచ్చరికలు పంపి బాధ్యతగా నడుచుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసారు.
అయినా ఇంకా ఇలా కొలికపూడి లాంటి వ్యక్తులు వివాదాలు సృష్టించుకుంటూ పార్టీకి, ప్రభుత్వానికి సమస్యలకు తెస్తూనే ఉన్నారు. ఇక కొలికపూడి వ్యాఖ్యల పై చంద్రబాబు ఎటువంటి చర్యలకు ఆదేశాలు ఇస్తారో అంటూ అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు.




