తెలంగాణ బిజేపి అధ్యక్షుడు రాంచందర్ రావు మూడు రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనతో రాష్ట్ర రాజకీయాలలో మార్పులు మొదలవుతాయన్నారు. అప్పుడు అదొక రోటీన్ ప్రకటనగా అందరూ లైట్ తీసుకున్నారు. కానీ నిజమేనని నిరూపితమైంది.
గతంలో ప్రధానిపై నిత్యం కత్తులు దూసిన కేసీఆర్, ఇప్పుడు తాను పోరాడి సాధించిన తెలంగాణ గడ్డపై ప్రధాని మోడీ నిలబడి ‘పశ్చిమ బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణయే’ అని చెపితే కేసీఆర్ స్పందించలేకపోయారు. ఒకవేళ మళ్ళీ ప్రధాని మోడీపై కత్తులు దూస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇంకా దిగజారుగుతుందే తప్ప మెరుగుపడే అవకాశం లేదు.
కల్వకుంట్ల కవిత చెప్పినట్లు భవిష్యత్లో బీఆర్ఎస్ పార్టీని బిజేపిలో విలీనం లేదా పొత్తు కోసమే కేసీఆర్ మౌనం వహించారని అనుకోవడానికి కూడా లేకుండా చేశారు మోడీ. ప్రధాని హోదాలో ఉన్న ఆయన హైదరాబాద్లో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి సుమారు గంట సేపు భేటీ అవడం ద్వారా మునిగిపోతున్న నౌక వంటి బీఆర్ఎస్ పార్టీతో పొత్తులు, విలీనం పట్ల బిజేపికి ఏమాత్రం ఆసక్తి లేదని స్పష్టం చేసినట్లే.
అంటే వచ్చే ఎన్నికలలో ఏపీలో మాదిరిగానే మూడు పార్టీలు కలిసి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రధాని మోడీ స్పష్టమైన సంకేతం పంపినట్లే భావించవచ్చు.
కనుక ప్రధాని మోడీ ప్రకటనపై కేసీఆర్ మౌనాన్ని బీఆర్ఎస్ పార్టీ నిస్సహాయతగానే భావించాల్సి ఉంటుంది. మొన్న సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పుడు, “ఎన్నికలైపోయాయి ఇక రాజకీయాలొద్దు… అభివృద్ధి గురించి మాట్లాడుకుందాము. మా ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి మీ ఆశీర్వాదాలు కావాలి,” అని సిఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. కానీ ప్రధాని మోడీ ‘మా నెక్స్ట్ టార్గెట్ తెలంగాణయే’ అని ఆయనకీ షాక్ ఇచ్చి వెళ్ళిపోయారు. కనుక సిఎం రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు.
ఒకవేళ కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఇప్పుడు స్పందించక పోయినా నష్టం లేదు. కానీ ప్రధాని మోడీ చేసిన ఈ తాజా ప్రకటన, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లతో భేటీ నేపధ్యంలో ఇకపై ఏవిధంగా ముందుకు సాగాలి? తమ కార్యాచరణలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి? అని మేదోమధనం చేయకతప్పని పరిస్థితి వాటికి కల్పించి వెళ్ళారు ప్రధాని మోడీ! రాంచందర్ రావు కూడా ఇదే చెప్పారుగా!




