ఓ పక్కన దాసరి నారాయణరావు పార్థీవ దేహం ఉండగా, మరో పక్కన దాసరి పెద్ద కోడలంటూ ఓ మహిళ ఆస్తిపాస్తులను ప్రస్తావిస్తూ చేసిన హంగామా తెలియనిది కాదు. అయితే ఇంతకీ తన ఆస్తుల గురించి దాసరి వీలునామా లాంటిది ఏమైనా రాసారా? లేదంటే అలాంటి గురుతర బాధ్యతను ఎవరికైనా అప్పగించారా? అంటే అలాంటి సంగతులను దాసరి శిష్యుడు మోహన్ బాబు తాజాగా ప్రస్తావించారు.
“దాసరి నారాయణరావు కన్న బిడ్డలకు సంబంధించిన ఆస్తి పంపకాల గురించి ఇప్పుడే మాట్లాడటం చాలా తొందరపాటు చర్య అవుతుందని, ఈ విషయమై కొన్ని సమస్యలు ఉన్నాయని, పరిష్కరించే బాధ్యత తనపై ఉందని” మోహన్ బాబు అన్నారు. తనతో గురువు గారి పెద్ద కొడుకు ప్రభు, అల్లుడు రఘు మాట్లాడుతుంటారని, ఆస్తుల పంపకాలు సాఫీగా జరిగేలా చూసుకోవాల్సి ఉందని అన్నారు.
‘నిజానికి గురువు గారు రెండోసారి ఆసుపత్రిలో చేరి, ఆపరేషన్ థియేటర్ కి వెళ్లే ముందు ఆర్థిక వ్యవహారాల గురించి ప్రస్తావించానని’ తెలిపారు మోహన్ బాబు. ‘పిల్లలకు ఏమీ చేయలేదు, ఇంకా ఏమైనా సెటిల్ చేయాల్సినవి ఉంటే చెప్పండి’ అని అడగగా… అప్పుడు… ఎదురుగా ఉన్న ఓ వ్యక్తిని చూపించారు. ఆ వ్యక్తి ఒకటి రెండు విషయాలు చెప్పారు తప్ప, అంతకుమించి ఏం లేదని అన్నారు మోహన్ బాబు. మొత్తానికి దాసరి కుటుంబ బాధ్యతలను మోహన్ బాబు నెత్తికెత్తుకున్నట్లుగా కనపడుతోంది.



