మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో సహా పలువురు దొరికిపోవడంతో బీఆర్ఎస్ పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. సరిగ్గా ఇదే సమయానికి శాసనసభ సమావేశాలు మొదలవడంతో కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పుకోలేక తడబడుతోంది.
ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విసిరిన సవాలుని బీఆర్ఎస్ పార్టీ ధైర్యంగా స్వీకరించలేకపోతోంది. ఆయనేమన్నారంటే, “మా సిఎం రేవంత్ రెడ్డితో సహా మా పార్టీలో ప్రజా ప్రతినిధులందరం వస్తాం. మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ) మీ అధ్యక్షుడు కేసీఆర్తో సహా అందరూ రండి. అందరం శాసనసభలోనే డ్రగ్ టెస్టు చేయించుకుందాము. మనల్ని ఎన్నుకున్న ప్రజలకు మనకి డ్రగ్స్ అలవాటు లేదని తెలియాలంటే ఇదొక్కటే మార్గం. డ్రగ్ టెస్టుకి మేమందరం రెడీ. మీరు రెడీయేనా?” అంటూ సవాలు విసిరారు.
దీనికి కేటీఆర్ స్పందిస్తూ, ‘నేను రెడీ’ అని ట్వీట్ చేశారు. కానీ ‘పార్టీలో అందరం రెడీ’ అని ధైర్యంగా చెప్పలేకపోయారు. అందువల్లే నేడు మండలిలో మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఇదే సవాలు విసిరారు. కానీ ఇప్పుడూ ధైర్యంగా రెడీ అనలేకపోయారు.
ఒకవేళ డ్రగ్ టెస్టుకి ఒప్పుకుని చేయించుకుంటే, కాంగ్రెస్ నాయకులు టెస్ట్ రిపోర్ట్ తారుమారు చేయించి ‘పాజిటివ్’ అని వచ్చేలా చేస్తే? అనే భయం ఉంది. ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారంతో తల దించుకున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రజలకు మొహం చూపలేరు.
ఇలాంటి సమస్య వస్తుందని జాగ్రత్త పడుతూ డ్రగ్ టెస్టు చేయించుకోకపోతే, అందరికీ డ్రగ్స్ అలవాటు ఉంది కనుకనే టెస్టు చేయించుకోవడానికి భయపడుతున్నారు,” అంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారం చేయకమానరు. కనుక ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ నేతల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులో రోహిత్ రెడ్డిని అక్రమంగా ఇరికించిందని మొదట వాదించిన బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు అయనకు నోటీస్ ఇచ్చి, “డ్రగ్స్ వాడుతూ పట్టుబడటంపై వారం రోజులలోగా వివరణ ఇవ్వాలంటూ,” నోటీస్ జారీ చేయడం గమనిస్తే బీఆర్ఎస్ పార్టీ అందితే జుట్టు లేకుంటే కాళ్ళు పట్టుకుంటుందని స్పష్టమవుతోంది.




