మహిళల చున్నీలు తీయించిన మీరా మాకు చెప్పేది? జనసేన

Nadendla Manohar fires on cm ys jaganనరసాపురం సభలో సిఎం జగన్‌ జనసేనని రౌడీ పార్టీ అనడంపై ఆ పార్టీ సేనియర్ నేత నాదెండ్ల మనోహర్ తీవ్రంగా స్పందించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పార్టీ సమీక్ష కోసం మంగళవారం ఉదయం ఆయన విశాఖకు వచ్చిన్నప్పుడు విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత చరిత్ర ఏమిటో అందరికీ తెలుసు. కనుక ఆయన ఇచ్చే కాండక్ట్ సర్టిఫికేట్ మాకేమీ అక్కరలేదు. తన సభకు వచ్చిన మహిళల చేత చున్నీలు తీయించిన ఘనత ఈ ముఖ్యమంత్రిదే. అందుకు ఆయన మహిళలకు బేషరతుగా క్షమాపణలు చెప్పితీరాలి.

సొంత నియోజకవర్గంలోనే పర్దాలు, బ్యారికేడ్లు పెట్టించుకొని తిరిగే ముఖ్యమంత్రి జగన్‌కి నిత్యం ప్రజల మద్యే ఉంటూ వారికి అండగా నిలబడే మా పార్టీ గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా లేదు. ప్రజలంటే భయపడే ముఖ్యమంత్రిని ఇపుడే చూస్తున్నాము. ఆయనకు ప్రజల ఓట్లు కావాలి కానీ ప్రజలు అక్కరలేదు. వారిపై ఏమాత్రం గౌరవం లేదు. అందుకే మహిళల చున్నీలు తీయించారు. అటువంటి వ్యక్తి మా పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి, వ్యక్తిత్వానికి అద్దం పడుతున్నాయి. తన బహిరంగసభల కోసం అన్ని వ్యవస్థలను వాడుకొంటూ ఇతరులకు నీతులు చెప్పడం ఆయనకే చెల్లు.

ADVERTISEMENT

ఉమ్మడి విజయనగరం జిల్లాలో వారం రోజులపాటు బస చేసి ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి పోరాడేందుకే వచ్చాను. మా పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకొని ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడేలా శిక్షణ ఇస్తాము. జగన్‌ పాలనలో వైసీపీ నేతల ఈ అరాచకాలు, అవినీతి, అక్రమాలు, అసమర్దతతో ప్రజలు విసుగెత్తిపోయున్నారు. వైసీపీ నేతలంటే సామాన్య ప్రజలు సైతం భయపడే పరిస్థితి దాపురించిందంటే రాష్ట్రంలో ఎటువంటి పాలన సాగుతోందో అర్దం చేసుకోవచ్చు. కనుక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వైసీపీ పాలన నుంచి విముక్తి కల్పించడమే మా పార్టీ ఏకైక లక్ష్యంగా పనిచేస్తాము,” అని అన్నారు.

సిఎం జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చిన మహిళల చున్నీలు తీయించడంపై మీడియాలో ప్రముఖంగా వార్తలు, ఫోటోలు వచ్చాయి. పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్ళిళ్ళు గురించి మాట్లాడితేనే నోటీసులు పంపించే ఏపీ మహిళా కమీషన్‌ ఛైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మావతి అసలు ఈ వార్తలు చూడనట్లే మౌనంగా ఉండిపోయారు. సిఎం సభలో మహిళల చేత చున్నీలు తీయిస్తుంటే రాష్ట్రంలో మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయో తెలీదు. ఒక్కటీ స్పందించనేలేదు. ఇక మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా దీనిపై ఏమీ మాట్లాడలేదు.

రేపు శ్రీకాకుళం జిల్లాలో సిఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించబోతున్నారు. అక్కడ కూడా మహిళలను ఇలాగే అవమానిస్తారా? అటువంటప్పుడు ఆయన సభలకు మేము ఎందుకు రావాలి? అనే మహిళల ప్రశ్నకు ఎవరు సమాధానం చెపుతారు?

ADVERTISEMENT
Latest Stories