నగరి జడ్పీ సర్వసభ్య సమావేశం తెలుగుదేశం – వైకాపా నేతల వాగ్వాదంతో రసాభాసగా మారింది. ఎమ్మెల్యే రోజా తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పేపర్ కటింగ్స్ ను తెలుగుదేశం ప్రదర్శించడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ ను తీవ్రంగా విమర్శిస్తూ ‘ముమ్మాటికీ శనీశ్వరుడే… లేకపోతే ఈ ఉపద్రవాలేమిటి?’ అంటూ రోజా చేసిన వ్యాఖ్యల పేపర్ కటింగ్స్ చూపుతూ పలువురు తెలుగుదేశం సభ్యులు రోజాను అడ్డుకున్నారు.
దీంతో సభను వాయిదా వేస్తున్నట్టు సీఈఓ ప్రకటించగా, ఆపై బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనూ రోజాను తెలుగుదేశం జడ్పీటీసీలు అడ్డుకున్నారు. అంతకుముందు రోజా మాట్లాడుతూ, చంద్రబాబు సర్కారు రాజకీయ పక్షపాతం చూపుతోందని విమర్శించారు. తన నియోజకవర్గానికి వస్తే, రుణమాఫీ విషయంలో ఈ విషయాన్ని నిరూపిస్తానని సవాల్ విసరడంతో గొడవ ప్రారంభమైంది.



