వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ గతంలో టీడీపీ నేతల మీద నోరుపారేసుకుంటూ నిత్యం ఎదో ఒక వార్తలలో కనిపిస్తే, ఈ మధ్యకాలంలో చేసిన పాపాలకు సమాధానం చెప్పలేక నోట్లో నీళ్లునములుతూ ఎక్కువగా వార్తలలో నిలుస్తున్నారు.
ఇన్నాళ్లు జైళ్లు, బైళ్ళు అనగానే అందరికి మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గుర్తుకొచ్చేవారు. కానీ ఇప్పుడు వైసీపీ నేతలలో కొందరు సాధారణ బైళ్ల కోసం, మరికొందరు ముందస్తు బైళ్ల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ అధినేతతో పోటీ పడుతున్నారు.
ఇప్పుడు ఈ కోవలోకే వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ వచ్చి చేరారు. నిన్నటి వరకు టీడీపీ కేంద్ర కార్యాలయంపై మీద దాడి చేసిన కేసులో అరెస్టయ్యి పోలీస్ రిమాండలో ఉంటూ బైలు దక్కించుకున్న ఈ పెద్దమనిషి ఇప్పుడు తనకు బైలు వచ్చింది, మోక్షం దక్కింది అని ఆనందించే లోపే మళ్ళీ మరో కేసులో అరెస్టయ్యారు.
అయితే ఇప్పుడు హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు జైలు పాలయ్యారు సదరు మాజీ ఎంపీ గారు. 2020 వెలగపూడిలో జరిగిన ఘర్షణలో మరియమ్మ అనే మహిళ హత్యకు గురయ్యింది. ఈ కేసులో సురేష్ పాత్ర మీద అనుమానాలు రావడంతో మంగళగిరి పోలీసులు మాజీ వైసీపీ ఎంపీ ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.
దీనితో కేసు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం సురేష్ ను అక్టోబర్ 21 వరకు పోలీస్ రిమాండ్ కు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో సురేష్ తిరిగి శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుకున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డు అదుపు లేకుండా చేసిన పాపాలు ఇప్పుడు శాపాలై వెంటాడుతున్నాయా అన్నట్టుగా ఒక కేసు నుండి కాస్త ఊరట దక్కింది లే అని సంతోషించే లోపే మరో కేసుతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు సురేష్.
గతంలో ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకుని పాలన మీద కాకుండా పగ తీర్చుకోవడం మీద ద్రుష్టి పెట్టిన వైసీపీ నేతలందరికీ నందిగామ సురేష్ ఉదాంతం ఒక చెంపపెట్టుగా మారనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది.
ఇప్పటికే జోగి రమేష్, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, సజ్జల వంటి వారు తమ పాపాలు ఎక్కడ జైలుకు సాగనంపుతాయో అనే భయంతో కోర్టుల నుండి ముందస్తు బైళ్ళు తెచ్చుకుని మీడియా ముందు మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు.




