గతంలో వైసీపీ నేతలు నారా లోకేష్కి తెలుగులో సరిగ్గా మాట్లాడటం రాదంటూ ఎద్దేవా చేసేవారు. వారి విమర్శలకు క్రుంగిపోకుండా ఒక్క తెలుగులోనే కాదు హిందీలో కూడా అనర్గళంగా ప్రసంగిస్తూ అందరినీ మెప్పిస్తున్నారు.
నేడు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు (ఏఎంసీఏ)కి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి సిఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రూ.15,803 కోట్లు పెట్టుబడితో ఏర్పాటుచేస్తున్న ఏఎంసీఏలో యుద్ధ విమానాలు తయారు చేస్తారు.
వేదికపై ఢిల్లీ నుంచి వచ్చిన అనేక మంది హేమాహేమీలు, ఎదురుగా వేలాదిమంది ప్రజల సమక్షంలో మంత్రి నారా లోకేష్ అలవోకగా అనర్గళంగా కాసేపు తెలుగులో కాసేపు హిందీలో ప్రసంగించారు.
నారా లోకేష్ హిందీలో అంత చక్కగా ప్రసంగిస్తుంటే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా చిర్నవ్వుతో ఆసక్తిగా విన్నారు.
ఈ ప్రాజెక్టు కోసం తాను, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలతో కలిసి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిసి అభ్యర్ధించడం, అందుకు ఆయన వెంటనే అంగీకరించి మంజూరు చేయడం, చేసినప్పటి నుంచి నేడు ఈ ప్రాజెక్టు శంకుస్థాపన వరకు తామందరం చేసిన కృషి గురించి మంత్రి నారా లోకేష్ హిందీలో వివరిస్తున్నప్పుడు రాజ్నాథ్ సింగ్ అవునన్నట్లు తలూపారు.
ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏవిధంగా సహకరిస్తున్నారో మంత్రి నారా లోకేష్ హిందీలో చక్కగా వివరిస్తున్నప్పుడు రాజ్నాథ్ సింగ్ ఆయనని మెచ్చుకున్నట్లు చూశారు.
ఓ పక్క ఢిల్లీ పెద్దలని హిందీ ప్రసంగంతో మెప్పిస్తూనే మరోపక్క సీమ ప్రజలను నిరాశ పరచలేనంటూ తెలుగులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద పంచులు మీద పంచులు వేస్తూనే ఉన్నారు.
ఈవిధంగా మంత్రి నారా లోకేష్ అటు ఢిల్లీ పెద్దలని, సభకు వచ్చిన వేలాదిమంది ప్రజలను కూడా ఒకేసారి మెప్పించారన్న మాట!
కానీ నారా లోకేష్ని అంతగా అవహేళన చేసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం నేటికీ తెలుగులో కూడా సరిగ్గా మాట్లాడలేక తడబడుతూ ఏదో మాట్లాడేసి నవ్వుల పాలవుతూనే ఉన్నారు.
పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఈ సభలో హిందీలో అనర్గళంగా మాట్లాడి ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రులను మెప్పించారు.
‘నేను మన ప్రభుత్వంలో కేంద్ర మంత్రినే కానీ ఇక్కడ లోకల్ బాయ్ని కనుక నా రాష్ట్రం తరపున నేను మాట్లాడక తప్పదు,’ అన్నప్పుడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సహా అందరూ చిర్నవ్వులు నవ్వారు.
కేంద్ర ప్రభుత్వం సహకారంతో అటు చిత్తూరు నుంచి ఇటు ఇచ్చాపురం వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.






