మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటం గ్రామంలో ఇళ్ళు కూల్చివేతపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వ తీరుని తప్పు పడుతూ ఘాటుగా ఓ లేఖ విడుదల చేయడమే కాకుండా ఈరోజు ఉదయమే హైదరాబాద్ నుంచి ఇప్పటం చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా వైసీపీ ప్రభుత్వ తీరును తప్పు పడుతూ ట్విట్టర్లో వరుసగా సందేశాలు పెడుతూ బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలుపుతున్నారు. కానీ టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మాత్రం ఇళ్ళ కూల్చివేతను ఖండిస్తూ ఓ సందేశం పెట్టి ఊరుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఎందుకంటే, నారా లోకేష్ గత ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ వచ్చే ఎన్నికలలో కూడా మంగళగిరి నుంచే పోటీ చేయాలనుకొంటున్నారు. కనుక గత మూడేళ్ళుగా మంగళగిరిలో కార్యాలయం ఏర్పాటు చేసుకొని అనేక అభివృద్ధి పనులు చేపడుతూ, నియోజకవర్గంలోని ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో నిరంతరం పోరాడుటూ ప్రజలకు చేరువయ్యేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
కనుక మంగళగిరి నియోజకవర్గంలో పరిధిలోగల ఇప్పటం గ్రామంలో 53 మంది ఇళ్ళను వైసీపీ ప్రభుత్వం నిన్న కక్షపూరితంగా కూల్చివేస్తే నారా లోకేష్ తక్షణం అక్కడకు చేరుకొని బాధితులకు అండగా నిలబడతారని ఆశించడం అత్యాశ కాదు. కానీ హైదరాబాద్ నుంచి పవన్ కళ్యాణ్ ఇప్పటం చేరుకొని బాధితులను పరామర్శించారు కానీ నారా లోకేష్ ఇంకా అటువంటి ఆలోచన చేసినట్లు కూడా లేదు.
కష్టకాలంలో తమ పక్కనే నిలబడి ఓదార్చి ధైర్యం చెప్పే రాజకీయ నాయకులను ప్రజలు ఎన్నడూ మరిచిపోరు. మరి ఇంత చిన్న విషయం నారా లోకేష్కి తెలియదనుకోలేము. పార్టీ కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలతో నారా లోకేష్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇటువంటి సందర్భాలలో బాధితులకు అండగా నిలబడటం చాలా అవసరం. మరో వారం పదిరోజుల తర్వాత వెళ్ళినా ప్రజలు కూడా పట్టించుకోరు. కనుక తక్షణం ఇప్పటం గ్రామానికి వెళ్ళి బాధితులను పరామర్శిస్తే మంచిదేమో?తక్షణమే వెళ్ళగలిగితే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని ఈ విషయంపై గట్టిగా నిలదీయవచ్చు కూడా.



