టిడిపి యువనేత నారా లోకేష్ శనివారం తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలో యువగళంలో 136వ రోజునపాదయాత్ర చేశారు. ఇప్పటి వరకు 1,753 కిమీ పాదయాత్ర పూర్తిచేసి, ఇచ్చాపురం వరకు ఆగేదిలేదని నిరూపించారు. ఈ పాదయాత్రలో నారా లోకేష్ సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను స్వయంగా కళ్ళారాచూసి, వారి నోట విని అర్దం చేసుకొంటున్నారు. తదనుగుణంగానే టిడిపి మ్యానిఫెస్టో రూపు దిద్దుకొంటుండటం అందరూ చూశారు.
శుక్రవారం వెంకటగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తునప్పుడు నారా లోకేష్ జయంపు మోహిలేరమ్మ ఆలయం వద్ద బ్రాహ్మణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓ యువ అర్చకుడు చెప్పినది విని నారా లోకేష్ స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకొంటుంది.
సమాజంలో బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలు కాస్త భిన్నంగా ఉంటాయి. కటిక పేదరికం అనుభవిస్తున్నా ఉన్నత కులానికి చెందినవారిగా బ్రాహ్మణులపై ముద్రపడిపోయింది కనుక వారికి రిజర్వేషన్లు, సంక్షేమ పధకాలు వగైరా లభించవు. కనుక అనేక సమస్యలను ఎదుర్కొంటూనే జీవనం సాగిస్తుంటారు.
ఓ అర్చకుడు తమ సమస్యలను వివరించిన తర్వాత నిరుద్యోగభృతి గురించి ప్రస్తావిస్తూ, తమలో చాలామంది 8-10 ఏళ్ళ వయసులో వేదపాఠశాలలో చేరి ఓ 10-12 ఏళ్ళ పాటు వేదాలు నేర్చుకొంటామని చెప్పారు. టీటీడీ లేదా మరో వేదపాఠశాల నుంచి సర్టిఫికేట్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత తమకు ఏదో ఓ ఆలయంలో తప్ప వేరే చోట ఉద్యోగాలు లభించవు.
కనుక అంతవరకు మిగిలిన నిరుద్యోగులు మాదిరిగానే తాము అనేక ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటామని చెప్పారు. కనుక టిడిపి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మిగిలిన నిరుద్యోగులకు ఏవిదంగా నిరుద్యోగభృతి ఇస్తామని చెపుతోందో, అదేవిదంగా తమకు కూడా తమ సర్టిఫికెట్స్ ఆధారంగా నిరుద్యోగభృతి ఇవ్వాలని ఆ అర్చకుడు విజ్ఞప్తి చేశారు.
ఆయన తమ సమస్యను చెపుతున్నప్పుడు నారా లోకేష్ చాలా శ్రద్దగా వింటూ కాగితం మీద ఆ పాయింట్స్ నోట్ చేసుకొన్నారు. తర్వాత మాట్లాడుతూ, “మీరు నాకు తెలియని కొత్త విషయం చెప్పారు. టిడిపి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులు అందరికీ నెలకు రూ.3,000 చొప్పున యువగళం పేరుతో నిరుద్యోగభృతి ఇస్తామని ఇప్పటికే మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చాము. అది మీకు వర్తింపజేస్తాము.
ఇదివరకు నేను, కొల్లు రవీంద్ర మంత్రులుగా ఉన్నప్పుడు 2018లో నిరుద్యోగభృతి తీసుకువచ్చాము. అయితే అప్పుడు మీ సమస్య గురించి మాకు తెలియకపోవడంతో మీకు న్యాయం చేయలేకపోయాము. అది పొరపాటే. కానీ ఈసారి తప్పకుండా మీ అందరికీ నిరుద్యోగభృతి ఇస్తాము,” అని నారా లోకేష్ హామీ ఇచ్చారు.




