కొన్ని రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో జూ.ఎన్టీఆర్ చాలా అద్భుతంగా నటించారని ప్రశంసించేందుకు ప్రత్యేకంగా పిలిపించుకొన్నారు. సుమారు 20 నిమిషాల సేపు ప్రశంశించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కూడా చాలా అద్భుతంగా నటించారు. కానీ ఎందుకో ఆయనని మరిచిపోయారు!
భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్రమోడీ వచ్చినప్పుడు చిరంజీవిని ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రశంశించారు. ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడారు. తామిద్దరం ఏం మాట్లాడుకొన్నామో అందరికీ వివరించాల్సిన అవసరం లేదు కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే మాట్లాడుకొన్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. కనుక పవన్ చెప్పిందే నిజమనుకోక తప్పదు.
ఆదివారం గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా-53లో మెగాస్టార్ చిరంజీవికి ప్రతిష్టాత్మకమైన ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు-2022ని ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి చిరంజీవికి అభినందనలు తెలియజేశారు.
ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్లో మెగాస్టార్ చిరంజీవిపై ప్రశంశల వర్షం కురిపించేశారు. “గత నాలుగు దశాబ్ధాలలో చిరంజీవి 150కి పైగా సినిమాల నటించి అందరినీ మెప్పించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన చాలా పాపులర్. చాలా అద్భుతంగా నటిస్తుంటారు. చిరంజీవికి శుభాకాంక్షలు,” అని ట్వీట్ చేశారు.
అయితే ఊరకరారు మహానుభావులు అన్నట్లు ప్రధాని నరేంద్రమోడీ చిరంజీవి, పవన్ కళ్యాణ్లపై హటాత్తుగా ఇంత ప్రేమాభిమానాలు చూపడానికి బలమైన కారణమే ఉండి ఉంటుంది. ఏపీలో కూడా తమిళనాడు ఫార్ములాను అమలుచేయాలనుకొంటున్నారేమో తెలీదు. ఏపీలో బిజెపి ఎలాగూ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రాలేదు కనుక పవన్ కళ్యాణ్కి అన్ని విదాల మద్దతు ఇచ్చి అధికారంలోకి తీసుకురాగలిగితే, జనసేనతో కలిసి ఏపీలో బిజెపి అధికారంలోకి రావచ్చునని భావిస్తున్నారేమో?
అయితే ఆవేశపరుడైన పవన్ కళ్యాణ్ యువతని ఆకర్షించగలుగుతున్నారు కానీ పెద్దవారి నమ్మకాన్ని పొందలేకపోతున్నారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో పెద్దల మద్దతు పొందలేకపోతున్నారు. కనుక చిరంజీవిని కూడా రంగంలో దించి వారినీ ఆకట్టుకోవచ్చని బిజెపి పెద్దలు భావిస్తున్నారేమో?
“డబ్బు ఎవరికీ ఊరికే రాదన్నట్లు” అవార్డులు కూడా ఎవరికీ ఊరికే ఇవ్వరనుకొంటే కధ అర్దం అవుతుంది. ఇటువంటి ఆలోచనలు ఏవో ఉండబట్టే రామభజన చేసే కాషాయపార్టీ పెద్దలకి హటాత్తుగా సినిమాల మీద, సినీనటుల మీద ప్రేమ పుట్టుకొచ్చి ఉండవచ్చు. ఇది అవునో కాదో రాబోయే రోజుల్లో ఎలాగూ తెలుస్తుంది. కానీ బిజెపి పెద్దల ఆలోచన ఇదే అయితే, అప్పుడు 175 సీట్లు గెలుచుకొని మరో 30 ఏళ్ళు మనమే పాలిస్తామని భ్రమలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, లాస్ట్ ఛాన్స్ ఇమ్మనమని అడుగుతున్న చంద్రబాబు నాయుడు ఏం చేస్తారో?



