భారీగా నిరాశపరిచిన ప్రధాని నరేంద్ర మోడీ!

narendra-modi-disappoints-new-yearపెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా కఠిన నిర్ణయాలకు ‘సై’ అన్న నరేంద్ర మోడీ, కొత్త సంవత్సరం సందర్భంగా నల్ల కుభేరులను మరిన్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా ప్రకటనలు చేయనున్నారని, అలాగే ఇప్పటివరకు ఇబ్బందిపడిన సామాన్యులకు పలు తాయిలాలను ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. ఆశించిన విధంగానే అనుకున్న సమయానికి ప్రధాని ప్రసంగం ప్రారంభించారు గానీ, ఈ ప్రసంగం వలన ఎవరికీ ఎలాంటి ప్రయోజనం లేదన్న విషయం బహిర్గతమైంది.

పట్టణాల్లో నివసించే నిరుపేద, దిగువ మధ్య తరగతి, మధ్య తరగతి ప్రజల కోసం రెండు పథకాలు అమలులోకి తీసుకొస్తున్నామని… వారు కట్టించుకునే ఇంటికి తీసుకునే 9 లక్షల రూపాయల వడ్డీలో 4 శాతం రాయితీ ఇస్తామని… 12 లక్షల రుణానికి సంబంధించిన వడ్డీలో 3 శాతం రాయితీ ఇస్తామని… గ్రామాల్లో నిర్మించే ఇళ్ల రుణాల వడ్డీలో 3 శాతం రాయితీ ఇస్తామని ప్రకటించారు. అలాగే డీసీసీబీ, ప్రైమరీ సొసైటీల నుంచి తీసుకున్న అప్పుపై 2 నెలల వడ్డీ మాఫీ చేస్తామని చెప్పారు.

ADVERTISEMENT

మోడీ చెప్పినవి కేవలం పేపర్ ప్రకటనలకే తప్ప దేనికి ప్రయోజనం లేదని ఆర్ధిక నిపుణులు తేల్చేస్తున్నారు. పట్టణాల్లో 9 లక్షల రూపాయలతో ఇల్లు కట్టడం సాధ్యమేనా? అలాగే పల్లెల్లో గృహాలు నిర్మించడానికి బ్యాంకులకు వెళ్ళేది ఎంతమంది? అమలు సాధ్యం కాని అంశాలపై తాయిలాలు ప్రకటించి, మరోసారి విమర్శలకు తావిచ్చారని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఒక రకంగా ప్రస్తుతం ప్రకటించిన తాయిలాలు కూడా నల్లకుభేరులకు వరంగా మారే అవకాశం ఉందని పెదవి విరుస్తున్నారు.

మధ్య తరగతి ప్రజలకు గానీ, పేద వారికి గానీ అనుకూలంగా ఒక్క ప్రకటన చేయకపోవడంపై ప్రజలు కూడా మండిపడుతున్నారు. గత కొన్ని రోజులుగా మీడియా వర్గాల్లో భారీ స్థాయిలో జరిగిన ప్రచారం రీత్యా… మోడీ ప్రసంగంపై దేశమంతా ఎదురుచూసింది. కానీ, మోడీ ప్రసంగం ఏ ఒక్క వర్గాన్ని కూడా సంతృప్తి పరిచేలా చేయలేదని విశ్లేషణ.

ADVERTISEMENT
Latest Stories