నిన్న మోదీ తెలంగాణ పర్యటన, ఆయన అటు చేసిన ప్రసంగం తెలుగు రాష్ట్ర రాజకీయాలతో పాటుగా అటు దేశీయ స్టాక్ మార్కెట్లను కూడా తీవ్రంగా ప్రభావితం చేసిందనే చెప్పాలి. ఇరాన్ – అమెరిక యుద్ధ నేపథ్యంలో ప్రపంచం ఎదుర్కుంటున్న ఇంధన సంక్షోభం మీద స్పందించిన మోదీ భారతదేశం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను సూచించారు.
* వ్యక్తిగత వాహనాల బదులు ప్రజలు బస్సులు, మెట్రో సేవలు వినియోగించాలని,
* ఒక ఏడాది పాటు దేశ ప్రజలు బంగారం కొనుగోళ్లు చేయకూడదని శపథం చేసుకోవాలని,
* కంపనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాలు కల్పించాలని,
* ప్రజలు వంట నూనెల వినియోగం తగ్గించుకోవాలని,
* పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాహనాల స్థానంలో ఈవీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని,
* ఏడాది పాటు విదేశీ పర్యటనలకు దూరంగా ఉండాలని,
* మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులనే ప్రోత్సహించాలని
* మధ్యతరగతి ప్రజలు ఆర్భాటాలకు పోకుండా అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని…ఇలా మోదీ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రజలకు కొన్ని సూచనలు చేసారు.
అయితే దేశ ప్రధానిగా మోదీ చేసిన ఈ సూచనలను సాధ్యమైనంత మేరకు ఆచరించడం కూడా ఒక రకంగా దేశ సేవే అంటున్నారు ఆర్థిక విశ్లేషకులు. ఇరాన్ యుద్ధ నేపథ్యంలో గత రెండు మూడు నెలల నుంచి దేశం గ్యాస్, ఇంధన కొరతను ఎదుర్కొంటుంది.
హార్మోజ్ జలసంధి యుద్ధ ప్రభావంతో నిర్బంధం లోకి వెళ్లడంతో ఎక్కువగా ఇంధన దిగుమతి మీద ఆధారపడే భారతదేశం పై ఆర్థిక భారం క్రమక్రంగా పెరుగుతూ పోతుంది. అయితే ఆ భారం వినియోగదారుల మీద పడకుండా ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు ఆదేశాలు ఇవ్వడంతో ఇక ఆయిల్ సరఫరా చేసే కంపెనీలకు భారీ నష్టాలు ఎదురవుతున్నాయి.
ఇక బంగారం విషయంలో కూడా భారత్ విదేశీ దిగుమతుల మీదే ఆరాధపడాల్సిన పరిస్థితి. ఇలా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వినియోగం పెరిగడంతో భారత్ విదేశీ మారక నిల్వలు దాదాపు 7.794 బిలియన్ డాలర్ల తగ్గి 690.693 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.
దాని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రంగా పడే ప్రభావం ఉంది. దీనితో డాలర్ విలువ పెరిగిపోవడం, రూపాయి విలువ పతనం ఒకేసారి జరుగుతుంది. బంగారం అధికంగా కొనుగోలు చేసే దేశాలలో భారత్ కూడా ప్రధమ స్థానంలో ఉండడంతో దేశ ప్రజలు బంగారం కొనుగోళ్లను కాస్త వాయిదా వేసుకోవాలని, ఇంధన ఆదా కోసం పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను వినియోగించుకోవాలని సూచించారు.
భారత్ వీటి దిగుమతులను తగ్గించుకోగలిగితే విదేశీ మారక ద్రవ్యం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రధాని మోదీ చేసిన సూచనలు నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో కళ్యాణ్ జులరీస్, టైటాన్, సెంకో గోల్డ్ వంటి బంగారం కు సంబంధించిన కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.
ఈ ఉహించని పరిణామంతో కంగుతిన్న గోల్డ్ షాప్ యజమానులు రేపు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ని కలిసేందుకు సిద్ధమయ్యారు. ప్రధాని చేసిన ఆ ఒక్క సూచన తమ వ్యాపారాన్ని తీవ్రంగా ప్రభావితం చెయ్యగలదని, తమ గోడు మోదీకి వినిపించేందుకు ఈ నెల 12 న మోదీని కలవనున్నట్లు జ్యులరీ అసోసియేషన్ వెల్లడించింది.




