నోట్ల రద్దు తర్వాత పెద్ద నోట్లను బ్యాంకుల్లో జమ చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. నేడు కూడా రద్దయిన నోట్లను బ్యాంకుల్లో జమచేసుకోలేకపోయిన వారు తగిన ఆధారాలు చూపించి రిజర్వు బ్యాంకులో వచ్చే ఏడాది మార్చి 31 వరకు మార్పిడి చేసుకోవచ్చు. ఇక కరెన్సీ కష్టాలు తీరడానికి ప్రధాని నరేంద్ర మోడీ అడిగిన 50 రోజుల గడువు కూడా నేటితో ముగియనుంది.
అయినా ఇప్పటికీ ప్రజలు కరెన్సీ కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఏటీఎంలు ఇంకా దిష్టిబొమ్మల్లానే దర్శనమిస్తున్నాయి. 80 శాతం ఏటీఎంలు ముందు ఇంకా ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. డిమాండ్ మేరకు కొత్త నోట్ల ముద్రణ లేకపోవడంతో మరో రెండు నెలల పాటు నోట్ల కష్టాలు కొనసాగవచ్చని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరో వైపు నోట్ల రద్దు రోజు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ రేపు (శనివారం) మరోమారు జాతిని ఉద్దేశించి ప్రసంగించనుండడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది. ప్రజలకు ఆయనేం చెప్పబోతున్నారోనని దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను ప్రజలకు వివరించడంతో పాటు భవిష్యత్తులో చేపట్టే చర్యల గురించి ప్రధాని మోడీ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే నోట్ల రద్దుతో సాధించిన విజయాలతో పాటు నష్టాలను కూడా తెలుపుతారని సమాచారం.
వీటన్నింటికి మించి ప్రజలకు బోల్డన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మోడీ ప్రసంగంలో 5 కీలక అంశాలు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వాటిని పరిశీలిస్తే… పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్తగా 2 వేల నోట్లను చలామణిలోకి తెచ్చింది. ఇప్పుడీ నోట్లను కూడా రద్దు చేయనున్నట్టు ప్రధాని ప్రకటిస్తారు. అలాగే వంద లోపు ఉన్న చిన్న నోట్ల స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ తీసుకు రావాలన్న నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.
రెండోది… రైతుల పంట రుణాలను పూర్తిగా రద్దు చేయడం. మూడోది జీరో బ్యాలెన్స్ ఉన్న జన్ధన్ ఖాతాల్లో 10 వేలు జమ చేయడం, నాలుగవది నగదు ఉపసంహరణపై ప్రస్తుతమున్న ఆంక్షలు ఎత్తివేయడం, చివరిది బినామీ ఆస్తులపై తీసుకునే చర్యల విషయంలో కీలక ప్రకటన ఉండే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.



