పెద్ద నోట్ల రద్దుతో ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్న మోడీ సర్కార్, అటు బ్యాంకులలోనూ, ఇటు ఏటీఎంలోనూ కరెన్సీపై నియంత్రణ పెట్టిన విషయం తెలిసిందే. అయితే దీనికి ఉపశమనం కలిగించేది ఎప్పుడెప్పుడా అని దేశ ప్రజలంతా ఎదురుచూస్తున్న సందర్భంలో… కొత్త ఏడాది సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు ఓ గుడ్ న్యూస్ ను అందించబోతున్నారని తెలుస్తోంది.
ఏటీఎంలలో ప్రస్తుతం ఒకసారి 2,500 తీసుకునే అవకాశం ఉండగా, బ్యాంకుల నుంచి 24 వేల వరకు తీసుకునే అవకాశం మాత్రమే ఉంది. అయితే చాలా బ్యాంకులలో ఈ మాత్రం నగదును కూడా తమ కస్టమర్లకు ఇవ్వడంలో విఫలమవుతున్నాయి. 50 రోజుల పాటు ఈ కష్టాలను భరించండి… ఆ తర్వాత నేను చూసుకుంటాను అని చెప్పిన మోడీ వ్యాఖ్యలు మరో 10 రోజుల్లో ముగియనున్నాయి. దీంతో న్యూ ఇయర్ కానుకగా మోడీ అందించే స్వీట్ న్యూస్ ప్రస్తుతం మీడియా వర్గాల్లో హల్చల్ చేస్తోంది.
జనవరి 1వ తేదీ నుండి బ్యాంకులు విధించే పరిమితిని బట్టి ఖాతాదారులు ఏటీఎంల నుంచి తమకు ఎంత కావాలంటే అంత తీసుకోడానికి అనుకూలంగా నిర్ణయం ఉండబోతుందని సమాచారం. అలాగే బ్యాంకుల నుంచి విత్డ్రా చేసుకునే నగదు మీద కూడా విధించిన పరిమితిని ఎత్తేసే అవకాశం కనిపిస్తోందని, ఈ నెల 30వ తేదీ తర్వాత ప్రజలు డబ్బు కొరత అనేది ఉండబోదని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ఇవే వ్యాఖ్యలు ప్రధాని నోట నుండి వెలువడితే ప్రజల ఆనందాలకు అవధులు ఉండవేమో!
అయితే ఇప్పటివరకు 90 శాతంకు పైగా ఏటీఎంలు అందుబాటులోకి రాలేదు. మరి ఈ 10 రోజుల్లో కేంద్రం ఏం మహత్యం చేసి ఏటీఎంల విత్ డ్రాలపై నిబంధనలను ఎత్తివేస్తుందన్న ప్రశ్నలు ప్రజల మదిలో మెదులుతున్నాయి. అంటే కరెన్సీ ముద్రణ ఇప్పటికే జరిగిపోయి ఉందా? కరెన్సీని అందుబాటులో ఉంచుకుని కూడా కావాలనే ఒక ప్రణాళిక ప్రకారం దాచి ఉంచారా? వంటి అనేకానేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏది ఏమైనా కరెన్సీపై నిబంధన ఎత్తివేస్తే మాత్రం ప్రజల నుండి పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తం కావచ్చు.



